ఇబ్రహీంపట్నం రూరల్: వృత్తి నైపుణ్యం ఉంటే ఎక్కడైనా రాణించడం సులభమని అడిషనల్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతిని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మానవ మనుగడకు అవసరమయ్యే శిక్షణ విరాట్ విశ్వకర్మ ముందే నేర్పించారని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికై నా నైపుణ్యం నేర్పించి వృత్తులను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తకుర్మ శివకుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి కేశురాం, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, పీసీసీ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి


