సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి నుంచి ఎస్టీఓ అధికారి ఎం. లక్ష్మణ్, అసిస్టెంట్ ఎస్టీఓ అధికారి కె. అనురాధ రూ.2.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా ఇవాళ(గురువారం) చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.
బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్టీఓ అధికారి ఎం. లక్ష్మణ్ రూ.50 వేలు, అసిస్టెంట్ ఎస్టీఓ అధికారి కె. అనురాధ రూ.50 వేలు తీసుకున్నట్లు సమాచారం. అసిస్టెంట్ ఎస్టీఓ అధికారి కె. అనురాధ తన వ్యక్తిగతంగా నియమించుకున్న జంగయ్య అలియాస్ చిన్న ద్వారా రూ.50 వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
పట్టుబడిన అధికారులను అదుపులోకి తీసుకొని చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. పట్టుబడిన అధికారుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బాధితుడి పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి: భార్య అరిచిందని.. భర్త షాకింగ్ నిర్ణయం


