శంకర్పల్లి: పాఠశాల దశ నుంచి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్లో శంకర్పల్లి ఎంఈఓ సయ్యద్ అక్బర్ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్కుమార్, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా విద్యాధికారి సుశీందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్బర్ దంపతులను వారు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. 11 ఏళ్లుగా మండల విద్యాధికారిగా అక్బర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అనేది కేవలం ఉద్యోగానికి మాత్రమేనని.. వృత్తికి కాదన్నారు. అక్బర్ తన ఉపాధ్యాయ అనుభవాన్ని భవిష్యత్లోనూ విద్యార్థులకు సాయం చేసేందుకు తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో పలు మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు
బుధవారం శంకర్పల్లిలో నిర్వహించిన మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని మండలంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. 11 ఏళ్లుగా ఎంఈఓగా పని చేసిన ఆయన ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేశారని, అందుకు నిరసనగా కార్యక్రమానికి తాము, తమ సంఘంలోని ఉపాధ్యాయులు వెళ్లవద్దంటూ మంగళవారం పీఆర్టీయూటీఎస్, ఎస్టీయూ, టీపీయూఎస్, టీయూటీఎఫ్, ఎస్జీటీయూ, టీఎస్యూటీఎఫ్ సంఘాలు తీర్మానించుకున్నాయి.
శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్


