● చర్చలకు రైతులు ససేమిరా
● వెనుదిరిగిన ఆర్డీఓ, ఏసీసీ
యాచారం: న్యాయం చేస్తాం.. దీక్షలు విరమించండని కుర్మిద్ద గిరిజన రైతులను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు కోరారు. బుధవారం వారు గ్రామంలోని వ్యవసాయ భూముల వద్ద గిరిజన రైతులు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీకు న్యాయం చేసేందుకే మేమున్నది.. ఆందోళన చెందొద్దు.. దీక్షలు విరమించి గ్రీన్ ఫీల్డ్ రహరదారి నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఇందుకు స్పందించిన రైతులు టీజీఐఐసీ పేరిట మార్చిన 200 ఎకరాల పట్టా భూమిని తమ పేరిట చేస్తేనే దీక్షలు విరమిస్తామని భీష్మించుకున్నారు. భూరికార్డులు మార్చితే రహదారి నిర్మాణానికి భూములిచ్చే ఆలోచన చేస్తామని తేల్చిచెప్పారు. భూ రికార్డుల మార్పు అంశం ప్రభుత్వ పరిధిలోని ఉందని.. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆదేశాలు వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రహదారి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదని.. పరిహారం విషయం చర్చించుకుందామని ఆహ్వానించారు. ఇందుకు రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. వారి వెంట యాచారం తహసీల్దార్ అయ్యప్ప, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


