మహేశ్వరం: ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మహేశ్వరం మండల కేంద్రంలోనే కొనసాగించాలని కలెక్టర్ నారాయణరెడ్డికి మహేశ్వరం మండల పరిధిలోని సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జీహెచ్ఎంసీ పరిధిలోకి తరలించే ఆంశాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1995 నుంచి నియోజకవర్గ కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగుతోంది. దీంతో కందుకూరు, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలు, ఇతర ప్రాంతాలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. సిరిగిరిపురం రెవెన్యూ సర్వే నెంబర్ 71లో ఉన్న ప్రభుత్వ భూమిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్మాణం చేయాలని కోరారు. ఇప్పటికే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్డీఓ, తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఆర్డీఓతో మాట్లాడి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, పీఏసీఎఎస్ మాజీ చైర్మన్లు పి.అంబయ్య యాదవ్, మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, దేవులా నాయక్, కుమార్ నాయక్, రమేశ్, రవి నాయక్, కృష్ణ, అజాం, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్కు విన్నవించిన సర్పంచ్లు, నాయకులు


