ఏబీవీపీ నాయకుల డిమాండ్
చేవెళ్ల: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుర్వ మహిపాల్ అన్నారు. చేవెళ్లలో సోమవారం నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి 9,500ల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజురీయంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి విద్యపైనే ఆధారపడి ఉంటుందని తెలిసి కూడా విద్యారంగాన్ని పట్టించుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 15శాతం బడ్జెట్లో కేటాయింపులు ఉండేలా చూడాలన్నారు. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు హారిక, అనిల్, ప్రశాంత్, లోకేశ్, జైపాల్ పాల్గొన్నారు.
అక్రమ అరెస్ట్లతో నిరసనను ఆపలేరు
సీఐటీయూ జిల్లా నేత సాయిబాబా
కొత్తూరు: అక్రమ అరెస్ట్లతో అంగన్వాడీల ఉద్యమాలను ప్రభుత్వం ఆపలేదని సీఐటీయూ జిల్లా నాయకుడు బీసా సాయిబాబా అన్నారు. అంగన్వాడీల సమస్యలు, డిమాండ్ల సాధనకు సోమవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యమాన్ని అడ్డుకోవాలనే కుట్రతో అంగన్వాడీలు, మద్దతు తెలుపుతున్న నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం అణిచివేతకు నిదర్శనమన్నారు. అంగన్వాడీలకు నెలకు రూ.18 వేల వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో విడతల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంగన్వాడీలు ప్రేమలత, సుజాత, అనిత, నారాయణమ్మ, అరుంధ ఉన్నారు.


