క్యాంపు రాజకీయాలు షురూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఆయా పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో బిజీగా మారాయి. ఎన్నికై న అభ్యర్థులు చేజారిపోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని రహస్య ప్రదేశాల్లోని క్యాంపులకు తరలించాయి. కుటుంబ సభ్యులు సహా ఇతర పార్టీలకు టచ్లోకి వెళ్లకుండా వారి వద్ద ఉన్న ఫోన్లు సైతం తీసుకుని స్విచ్ఛాఫ్ చేసినట్లు సమాచారం. కొంత మంది గోవా, బెంగళూరు క్యాంపులకు తరలివెళ్లగా, మరికొంత మంది మొయినాబాద్, మహేశ్వరం సమీపంలోని ఫాం హౌసుల్లోని క్యాంపులకు తరలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. శనివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నెల 16న మధ్యాహ్నం 12 గంటలకు ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్లను ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఒక్కో మున్సిపాలిటీకి ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించింది. ఆయా పార్టీల నుంచి గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా చైర్మన్ ఎన్నికలో భాగస్వాములు కానున్నారు.
అప్రమత్తమైన అన్ని పార్టీలు
షాద్నగర్ కాంగ్రెస్ అభ్యర్థులు గట్టుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్కు తరలివెళ్లగా.. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాజీ ఎంపీ రంజిత్రెడ్డి ఫాంహౌస్లోని క్యాంపునకు తరలి వెళ్లారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థు లను బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. మొయినాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. ఇక బీజేపీ అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే రత్నం ఇంట్లో మకాం వేసి కూర్చొన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం క్యాంపునకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలిసింది. చైర్మన్ పీఠాన్ని అప్పగించేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. అభ్యర్థులు చేజారిపోకుండా ఆయా పార్టీలు జాగ్రత్త వహిస్తున్నాయి. అభ్యర్థుల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయించాయి. పూర్తిగా వారిని తమ ఆధీనంలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. స్వతంత్రులకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఎరగా వేస్తున్నట్లు తెలిసింది.
అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్తలు
ఫాంహౌసుల్లో అధికారపార్టీ అభ్యర్థులు
ఇతర రాష్ట్రాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల తరలింపు
16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక
ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు


