
ABCD ముద్దు
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
కనుమరుగవుతున్న తెలుగు మీడియం
అఆలు
వద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రైవేటులోనే కాదు ప్రభుత్వ స్కూళ్లలోనూ తెలుగు మీడియం కనుమరుగవుతోంది. తెలుగు ఒక సబ్జెక్టుగా మినహా.. మిగిలినవన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే బోధిస్తున్నారు. భవిష్యత్తు మొత్తం ఇంగ్లిష్తోనే ముడిపడి ఉంటుందని తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పుస్తకాలను ముద్రిస్తోంది. విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంపైనే మక్కువ చూపుతుండటంతో.. తెలుగు మీడియం చదివి, ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఇంగ్లిష్ నేర్చుకుని పాఠాలు బోధించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,300పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1.30 లక్షల మందికిపైగా చదువుతున్నారు. వీరిలో కేవలం 15 వేల మంది మాత్రమే తెలుగు మీడియంలో అభ్యసిస్తున్నారు. పూర్వ ప్రాథమిక దశలోనే చిన్నారులను ఇంగ్లిష్ మీడియంలో చేర్పిస్తుండటంతో తెలుగు మీడియం స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటులో ఒక్క తెలుగు మీడియం స్కూల్ లేకపోవడంపై భాషా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్బన్లో ఫుల్.. తండాల్లో నిల్..
జిల్లాలో మొత్తం 3,203 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో 9,50,079 మంది చదువుతున్నారు. 1,637 ప్రైవేటు స్కూళ్లలో 6,06,140 మంది, 107 సీబీఎస్ఈ స్కూళ్లలో 1,34,063 మంది, 10 ఐసీఎస్ఈ పాఠశాలల్లో 14,008 మంది చదువుతున్నారు. మిగిలిన వారంతా ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలు, కేజీబీవీలు, జ్యోతి బాపూలే వసతి గృహాల్లో అభ్యసిస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. కోర్ సిటీకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ పాఠశాలు సహా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు పోటెత్తుతున్నారు. మారుమూల తండాల్లోని స్కూళ్లకు మాత్రం ఆశించిన ఆదరణ లభించడం లేదు. గత విద్యా సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 96 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో పర్సంటేజీ అడ్మిషన్లు నమోదయ్యాయి. సింగిల్ టీచర్, మధ్యాహ్న భోజన పంపిణీ, పాఠశాల నిర్వహణ భారంగా మారడంతో గతేడాదే వీటిని మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకునే ప్రక్రియలో భాగంగా జిల్లా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్పందన లభించడం లేదు.
న్యూస్రీల్
ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్కే మొగ్గు
భవిష్యత్తు ఆంగ్లానిదేననే భావనలో తల్లిదండ్రులు, విద్యార్థులు
వెనుకాడుతున్న తల్లిదండ్రులు..
కొందుర్గు మండలం రామన్నగూడతండా, జిల్లెడుచౌదరిగూడ మండలం వేపకుంచతండా, దారరగిద్దతండా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కూడా అడ్మిషన్లు రాలేదు.
చేవెళ్ల మండలం నారాయణదాసుగూడ, జాలగూడ, ఇబ్రహీంపల్లిలోనూ ఈసారి కూడా జీరో అడ్మిషన్లే.
షాబాద్ మండలం మల్లారెడ్డిగూడ పాఠశాల రెండేళ్లుగా మూతబడి ఉంది. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను పంపాల్సిందిగా కోరినా.. ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు.
కొత్తూరు మండలం పీఎస్రెడ్డిపాలెం స్కూలు మూతపడింది. ఉపాధ్యాయులు తెరిచే ప్రయత్నం చేసినా.. తల్లిదండ్రుల నుంచి స్పందన రావడం లేదు.
శంకర్పల్లి మండలం కచ్చిరెడ్డిగూడ పాఠశాలో ఇప్పటి వరకు కేవలం రెండు అడ్మిషన్లు మాత్రమే నమోదయ్యాయి.
లచ్చిరెడ్డిగూడ పాఠశాలల్లో కూడా ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు.
లక్ష్మారెడ్డిగూడ, ఇరుకుంటతండా స్కూల్లో అడ్మిషన్లు లేక గతంలో మూసివేశారు.
ప్రస్తుతం లక్ష్మారెడ్డిగూడలో నాలుగు, ఇరుకుంట తండాలో రెండు అడ్మిషన్లు అయినా.. వీటి భవితవ్యం ప్రశ్నార్థకమే.
మొయినాబాద్ మండలం చిన్నషాపూర్ స్కూల్ను గతంలో అడ్మిషన్లు లేక మూసేశారు. ఇటీవల ఐదురుగు విద్యార్థులు చేరారు.

ABCD ముద్దు

ABCD ముద్దు