
తండ్రిని చంపిన తనయుడు
కందుకూరు: ఓ కొడుకు కన్నతండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పసుపుల చిన్న జంగయ్య(65), పద్మమ్మ భార్యభర్తలు. తముకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేయడంతో పాటు గొర్రెలను పోషిస్తూ బతుకుతున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. అందరికీ వివాహాలు కాగా కొడుకు శేఖర్ సెంట్రింగ్ పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా పొలాన్ని అమ్మాలంటూ శేఖర్ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. ఇటీవల పాత ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. పొలం అమ్మి ఇల్లు పూర్తి చేద్దామని శేఖర్ గొడవ పడుతున్నాడు. ఈవిషయమై పలుమార్లు గ్రామస్తుల మధ్య పంచాయితీ నిర్వహించగా అతన్ని మందలించారు. పిల్లర్లు, స్లాబ్ పూర్తి కావడంతో జంగయ్య దంపతులు పరదాలు కట్టుకుని ఇక్కడే ఉంటున్నారు. శేఖర్ గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి పద్మమ్మ ఇదే ఊరిలో ఉండే తన బిడ్డ ఇంటికి వెళ్లింది. దీంతో జంగయ్య ఒక్కడే కొత్త ఇంటి వద్ద నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి వెళ్లిన శేఖర్ నిద్రపోతున్న తండ్రి తలపై బండరాయితో మోది, కట్టెతో కొట్టి చంపేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో ఇంటికి వచ్చిన పద్మమ్మ రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి గుండెలు బాదుకుంది. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అతనిపై దాడికి ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న సీఐ సీతారామ్, ఎస్ఐ సైదులు అతన్ని అదుపులోకి తీసుకుని, పీఎస్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన కొడుకే ఈ దారుణానికి పాల్పడ్డాడని పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కన్నకొడుకే తండ్రి పాలిట యముడయ్యాడు. పొలం అమ్మనివ్వడం లేదని కక్ష పెంచుకుని.. నిద్రపోతున్న తండ్రిపై పాశవికంగా దాడి చేసి, కాటికి పంపించాడు.
కందుకూరు మండలం పులిమామిడిలో దారుణం
భూమి అమ్మనివ్వడం లేదని కక్ష పెంచుకున్న కొడుకు
బండరాయితో మోది, కర్రతో బాది హత్య
పోలీసుల అదుపులో నిందితుడు

తండ్రిని చంపిన తనయుడు

తండ్రిని చంపిన తనయుడు

తండ్రిని చంపిన తనయుడు