
మతం ముసుగులో మోదీ పాలన
హయత్నగర్: మోదీ సర్కార్ మతాన్ని అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్రెడ్డి ఆరోపించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై కులమతాల దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ తట్టిఅన్నారంలో బుధవారం నిర్వహించిన పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. దేశ సరిహద్దులో ఉన్న శత్రువులను పారదోలాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కగార్ పేరుతో అమాయక ప్రజలను ఎన్కౌంటర్ చేస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీపీఐ.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. రావి నారాయణరెడ్డి కాలనీ– 3లో గుడిసెలు వేసుకుని ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నవారికి నివాస స్థలాలు సాధించే వరకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవింద్రచారి, కౌన్సిల్ సభ్యుడు యాదిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు హరిసింగ్ నాయక్, మాజీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, నాయకులు నర్సింహ, నవనీత, అరుణ, మాధవరెడ్డి, వేణు, ప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు.
కగార్ పేరుతో అమాయకులను ఎన్కౌంటర్ చేస్తున్న కేంద్రం
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్రెడ్డి