
హైడ్రా కమిషనర్ ఫీల్డ్ విజిట్
సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఆయన క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. పోచారం మున్సిపాలిటీలోని సంస్కృతి టౌన్షిప్తో పాటు ఏకశిలా నగర్కు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల పూర్వాపరాలను పరిశీలించారు. సంస్కృతి టౌన్షిప్లో 100 ఫీట్ల రహదారికి అడ్డంగా స్థల యజమానులు పెట్టిన గేట్లను హైడ్రా కమిషనర్ తెరిపించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ల రహదారికి మార్కింగ్ చేసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొర్రెముల గ్రామంలోని ఏకశిలానగర్ లేఔట్కు సంబంధించి వివాదం పైనా ఆయన ఆరా తీశారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నా కబ్జాదారులు ఇల్లు కట్టుకొనివ్వడం లేదని ప్లాట్ల యజమానులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాలను పిలిచి అన్ని రికార్డులను పరిశీలిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. నెక్నాంపూర్లో ప్రధాన రహదారి నిర్మాణానికి ఉన్న ఆటంకాలను ఆయన పరిశీలించారు. అక్కడ దాదాపు 20 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా కొందరు స్థానికులు అది తమదే అంటూ రోడ్డు వేయనీయకుండా అడ్డుకోవడాన్ని ఆయన పరిశీలించారు. హైటెన్షన్ వైర్ల కింద నిర్మిస్తున్న రోడ్డుకు ఆటంకాలు కల్పించవద్దని కమిషనర్ స్థానికులకు సూచించారు. దీనిపైనా వచ్చే వారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. గచ్చిబౌలిలోని జనార్దన హిల్స్ వద్ద జరుగుతున్న వరద కాలువ పనులను, చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలు ఆయన పరిశీలించారు. ఖైతలాపూర్ వద్ద ముల్లకత్వ చెరువు నుంచి ఐడీఎల్ చెరువుకు వెళ్లే వరద కాలువ ఆక్రమణలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఐడీఎల్ చెరువు నుంచి కూకట్పల్లి నాలాలకు వెళ్లే వరద కాలువ ఆక్రమణలను తనిఖీ చేశారు. ఐడీఎల్ చెరువు నుంచి వెళ్లే నాలా ఆక్రమణ జరిగినట్టు గుర్తించిన హైడ్రా కమిషనర్ నాలా విస్తరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మూసాపేట మెట్రో స్టేషన్ పరిసరాల్లో నాలా కుంచించుకుపోవడంతో వరద ముంచెత్తుతోందని స్థానికులు రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. శివశక్తినగర్లో నాలా విస్తరణతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని, వెంటనే ఆ పనులు చేపట్టాలని అధికారులకు రంగనాథ్ సూచించారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ