
ఇందిరమ్మ నిర్మాణాల్లో వేగం పెంచండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, వన మహోత్సవంపై బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బేస్మెట్ లెవల్ పూర్తయిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 56.33శాతం ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని, మిగిలినవి కూడా త్వరగా ప్రారంభించాలని తెలిపారు.
25లోపు ప్రాంభించాలి
జూన్ 25 వరకు అన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం అవసరమైతే పేద మహిళకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. గ్రౌండింగ్ పూర్తయిన 15 రోజుల్లో పనులు లెంటల్ లెవెల్కు చేరేలా చూడాలన్నారు. 25లోపు కూడా గ్రౌండింగ్ కాని ఇళ్లను రద్దు చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. ఇప్పటి వరకు మొయినాబాద్, నార్సింగి, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో తక్కువ గ్రౌండింగ్ నమోదైందని వివరించారు. ఆయా మండలాల అధికారులు అప్రమత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చుకోవాలని సూచించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామ, మున్సిపల్ పరిధిలో ఈనెల 20నుంచి 28 వరకు పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. డ్రైనేజీలను శుభ్రం చేయించి, రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, లీకేజీలను సరిచేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, రోడ్లపై గుంతలను పూడ్చాలని ఆదేశించారు. జూలై మొదటి వారంలో ఆడిట్ బృందాలు తనిఖీకి వస్తాయని, సరిగా పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి, గుంతలు తీయాలని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి రామారావు, డీపీఓ సురేష్ మోహన్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ కుమార్రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి కేషురామ్, హౌసింగ్ పీడీ హనుమంతు నాయక్, గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ శ్రీలత, మెప్మా పీడీ మల్లీశ్వరి, డీఈఓ సుశీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
అధికారులతో సమీక్ష