
నాలాలు, పాత లేఔట్లు!
కబ్జా కోరల్లో
శ్లాబులు వేసి నాలాలపై నిర్మాణాలు
● పాత లేఔట్లలో పాస్పుస్తకాలతో పాగా
● వీలున్న చోటల్లా పార్కులూ స్వాహా
● హైడ్రా ప్రజావాణిలో 47 ఫిర్యాదులు
సాక్షి, సిటీబ్యూరో: ఓపక్క వర్షాకాలం... మరోపక్క హైడ్రా స్పందన... వెరసి నాలాల కబ్జాలపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. రాజధానిలోని కొన్ని నాలాలను పూడ్చి కబ్జా చేస్తుంటే... మరికొన్నింటి మీద శ్లాబులు వేసి ఇళ్లు, దుకాణాలు నిర్మిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఫలితంగా నాలాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించడం సాధ్యం కాక అవి పూడుకుపోతున్నాయని వాపోతున్నారు. సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి ద్వారా అనేక ఫిర్యాదులు అందాయి. మల్కాజిగిరి, బాచుపల్లి, సికింద్రాబాద్, పద్మారావునగర్, మాదాపూర్ ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఒకప్పటి గ్రామపంచాయతీ లేఔట్లను తిరిగి వ్యవసాయ భూములుగా చిత్రీకరిస్తున్న కొందరు తప్పుడు పాస్ పుస్తకాలతో కాజేస్తున్నారని మరికొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 47 ఫిర్యాదుల్లో అత్యధికంగా నాలాలు, పాత లే ఔట్లుకు సంబంధించినవే కావడం గమనార్హం. వీటిని సీరియస్గా తీసుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ సమగ్ర విచారణ జరపడంతో పాటు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కీలక ఫిర్యాదులు ఇలా...
● మేడ్చల్ జిల్లా కొరెముల గ్రామం సర్వే నెం.739 నుంచి 749 వరకూ 147 ఎకరాల్లో ఏకశిలానగర్ పేరుతో లే ఔట్ను 1985లో వేశారు. అందులోని 47 ఎకరాలను 2006లో వ్యవసాయ భూమిగా మార్చేసిన ఓ వ్యక్తి లే ఔట్ స్వరూపాన్నే మార్చేశారని ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే లే ఔట్లో రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంతమేర కాజేశాయని పేర్కొన్నారు.
● ఇదే గ్రామంలోని సర్వే నెం.796లో 11.20 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో 7.20 ఎకరాల పరిధిలో ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. మిగతా నాలుగు ఎకరాలు కబ్జా చేసి దీంతో పాటు నదెం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదు అందింది.
● పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో వెయ్యి గజాల పార్కు స్థలం ఉండేది. దీని నుంచి 500 గజాల స్థలంలో దుర్గాభవానీ ఆలయం నిర్మించారు. మిగిలిన 500 గజాల స్థలం కబ్జా కాకుండా పార్కును అభివృద్ధి చేయాలని అక్కడి నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు. ఆలయంతో పాటు చుట్టూ ఉన్న దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పార్కు కోసం కేటాయించాలని కోరారు. శ్రీనగర్కాలనీ నుంచి వచ్చే వరద కాలువ తమ కాలనీ ద్వారా వెళ్లేదని ఇప్పుడా కాలువ మాయం కావడంతో వరదంతా తమ నివాసాలను ముంచెత్తుతోందని వాపోయారు.
● అల్వాల్ మండలం జొన్న బండలోని వజ్ర ఎన్క్లేవ్లో 900 గజాల పార్కు స్థలం కబ్జా అవుతోందని, దానికి ఫెన్సింగ్ వేసి కాపాడాలంటూ అక్కడి నివాసితులు హైడ్రాను కోరారు. అక్కడ రహదారులను కూడా వదలకుండా కొందరు కబ్జా చేస్తున్నారని 236 ప్లాట్లకు పార్కు లేకుండా అవుతోందని పేర్కొన్నారు.
● దేవరయాంజల్లోని తురకోని కుంట శిఖం భూమిలో లారీలకు సంబంధించిన వేబ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారని వెంటనే ఆ పనులు ఆపి చెరువును కాపాడాలని సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల పరిరక్షణ సమితి ప్రతినిధులు హైడ్రాను కోరారు. ఇదే ప్రాంతంలో దేవస్థానానికి చెందిన భూమి కబ్జా అవుతోందని సేవ్ దేవరయాంజల్ ప్రతినిధులు హైడ్రా దృష్టికి తెచ్చారు.
● దేవరయాంజల్ చెరువుకు వెళ్లాల్సిన వరద కాలువను మళ్లించడంతో అది ఊరు నుంచి వచ్చే మురుగు ప్రవాహానికి ఆటంకంగా మారుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. వరద కాలువ నేరుగా చెరువుకు చేరేలా చేస్తే తమకు వరద ముప్పు తప్పుతుందని అభ్యర్థించారు.