
కీచకుడు చిక్కేదెలా?
యాచారం: సభ్య సమాజం తలదించుకునేలా మండలంలో ఇటీవల ఓ 90 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడిని కనిపెట్టే విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారు. కాటికి కాలు చాచిన వృద్ధురాలిపై జరిగిన అఘాయిత్యం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది తెలిసిందే. సంఘటన జరిగిన నాలుగైదు రోజులు గడుస్తునా ఆ కీచకుడికి కటకటాల్లోకి పంపే విషయంలో పోలీసుల కృషి విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించి వృద్ధురాలు కొన్ని క్లూ ఇచ్చింది. దాని ప్రకారమే పోలీసులు ఇప్పటివరకు 26 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు సదరు గ్రామంలో రెండు, మూడు చోట్ల వివిధ రకాల దావత్లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వారందరిని పిలిచి వివరాలు సేకరించారు. ఇదే విషయాన్ని సోమవారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుకు ఫోన్ చేసి మాట్లాడారు. 90 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం జరిగి నాలుగైదు రోజులు గడుస్తున్న ఆ కామంధుడిని పట్టుకునే విషయంలో ఎందుకు విఫలమవుతున్నారని అడిగారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఎమ్మెల్యే ఏసీపీకి సూచించారు.
వ్యసనాలకు బానిసలై
యువత, విద్యార్థులు మద్యానికి బానిసై నిత్యం ఘర్షణలు, తల్లిదండ్రులను సైతం లెక్కచేయకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆయా కాలనీల్లోని యువత వ్యసనాలకు గురవ్వడంతో అటు తల్లిదండ్రులు గానీ, ఇటు పోలీసులు గానీ పట్టించుకోకపోవడం పెద్ద శాపంగా మారింది. స్థానిక యువత మద్యం తాగడం కోసం తూర్పున నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రూట్లో, పశ్చిమాన మాల్ దారిలోని వ్యవసాయ పొలాల్లోకి గుంపులు, గుంపులుగా వెళ్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. కామాంధుడిని పట్టుకు ని కఠిన శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలని ఆ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ పొలాలకు, పశువుల, మేకల, గొర్రెల పెంపకం కోసం ఒంటరిగా వెళ్లాలంటేనే జంకుతున్నారు.
వృద్ధురాలిపై లైంగిక దాడి కేసులో
పోలీసుల నిర్లక్ష్యం
26 మందిని విచారించినా
ఎటూ తేలని వైనం
కఠినంగా శిక్షించాలని
గ్రామస్తుల డిమాండ్