
ప్రోత్సహిస్తే మరిన్ని పంటలు
‘రైతు నేస్తం’ సభలో యాచారం రైతు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ సభలో యాచారం మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటనర్సయ్య మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. నాకు మూడెకరాల భూమి ఉంది. ఎకరంలో కడీల పందిరి ఉంది. కాకర, బీర వంటి తీగజాతి పంటలతో పాటు అంతర పంటగా టమాటా, ఆకు కూరల సాగు చేస్తున్నా. ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారుల సహకారంతో కాయగూరలను పుష్కలంగా పండిస్తున్నా. మాకు సాగు నీళ్లు లేవు. మైలారం చెరువు నిండితేనే మాకు నీళ్లు. అది కూడా 700– 800 ఫీట్ల లోతు బోర్లు వేస్తేనే నీటి ఆనవాళ్లు లభిస్తున్నాయి. డ్రిప్ సహకారంతో పంటలు పండిస్తున్నాం. ఏడేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ పైపులు ఇవ్వడం లేదు. మా చౌదరిపల్లి నుంచి రోజుకు ఆరు డీసీఎంల కూరగాయలు నగరానికి వస్తున్నాయి. మా రైతులకు డ్రిప్ ఇవ్వాలి. పంట సాగులో లేబర్ సమస్య కూడా ఎక్కువ ఉంది. సబ్సిడీపై యంత్రాలను ఇప్పించాలి. మిగిలిన భూమిలో ఆలుగడ్డ పండించా. ఆశించిన దానికంటే అధిక దిగుబడి వచ్చింది. ఆ తర్వాత అదే భూమిలో మక్క పెట్టాను. మాకు కొలువు లేదు. భార్యాభర్తలిద్దరం పని చేసుకుంటున్నాం. మాకు ముగ్గురు పిల్లలు. కూరగాయల సాగుతోనే వారి పెళ్లిళ్లు చేశాం. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తే మరిన్ని పంటలు పండిస్తాం.