
పని తీరు మారాల్సిందే
శంకర్పల్లిః పట్టణం, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందని జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులను ప్రశ్నించారు. శంకర్పల్లి మోడల్ స్కూల్లో సోమవారం ఎంఈఓ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, శంకర్పల్లి ప్రభుత్వ బాలికల, బాలుర పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫలితాలపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించి సీరియస్ అయ్యారు. మోడల్ స్కూల్లో పది, ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గడంపై విశ్లేషించుకోవాలని సూచించారు. రాజకీయాలు మాని విద్యార్థులపై దృష్టి సారించాలని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాటను కొన్ని పాఠశాలలు నిర్వహించకపోవడం, మరికొన్ని స్కూళ్లు మొక్కుబడిగా చేయడంపై మండిపడ్డారు. జూలై 15న మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. సమావేశంలో ఎంఈఓ అక్బర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.
పని నచ్చకపోతే బదిలీ చేయండి
తన పని నచ్చకపోతే.. మరో చోటికి బదిలీ చేయాలని శంకర్పల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శోభారాణి డీఈఓ సుశీందర్రావుకి చేతులు జోడించి విన్నవించారు. సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె డీఈఓతో మాట్లాడారు. ‘సార్ మా పాఠశాలలోనే ఎంఈఓ కార్యాలయం ఉంది, ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు.. దీనిని మరో చోటికి మార్పించండి’ అని చెబుతుండగా ఎంఈఓ అక్బర్ కల్పించుకున్నారు. ‘నువ్వు ఊరుకోవమ్మా.. అనవసరంగా ఎక్కువ మాట్లాడకు’ అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ప్రిన్సిపాల్ తాను పాఠశాలకి వచ్చి కొన్ని నెలలే అవుతోందని, తన పని నచ్చకపోతే.. మరో చోటికి బదిలీ చేయాలని, చేతులు జోడించి కోరింది. మహిళలతో అలా దురుసుగా మాట్లాడొద్దని డీఈఓ ఎంఈఓను హెచ్చరించారు.
ఉత్తీర్ణత శాతం తగ్గడంపై డీఈఓ సీరియస్
నెల రోజుల్లో మార్పు రావాలని ఆదేశం