
ప్రక్షాళన.. పూర్తయ్యేనా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దేవాలయాల భూములకు రక్షణ లేకుండా పోతోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరగడంతో కేటుగాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. చివరికి వివాదాలు కోర్టులు, ఎండోమెంట్ ట్రిబ్యూనల్స్కు చేరుకుంటున్నాయి. ఈ వివాదాల పరిష్కారంలో నిజాం కాలం నాటి ఉర్దూ భాషలో ముద్రించిన ముంతకబ్ రికార్డులు కీలక సాక్షంగా నిలుస్తున్నాయి. వందల ఏళ్ల క్రితానికి చెందిన ఈ రికార్డులు ప్రస్తుతం అవసాన స్థితికి చేరుకున్నాయి. ముట్టుకుంటే చిరిగిపోతున్నాయి. నాటి ఉర్దూను అర్థం చేసుకోవడం నేటి అధికారులకు ఇబ్బందిగా మారింది. ఆలయ ఈఓలకు ఉర్దూపై కనీస పట్టు లేదు. దేవాలయ భూములపై అవగాహన లేకపోవడంతో కోర్టుల్లో కేసులు వీగిపోతున్నాయి. విలువైన ఆలయ భూములు చేజారిపోతున్నాయి. అంతే కాదు ముంతకబ్ రికార్డుల్లోని దేవాలయాల పేర్లు, ట్రస్టీ, ఫౌండర్ల గోత్ర నామాలు గుర్తించలేని స్థితికి చేరుకున్నాయి. వివాదాల పరిష్కారంలో కీలకమైన ఈ రికార్డులను భద్రపరచడంతో పాటు ఉర్దూ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి, భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని లోకాయుక్త సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరిగిపోతున్న ఎండోమెంట్ పెండింగ్ కేసులు
విచారణలో కీలక సాక్ష్యాలుగా మారిన ముంతకబ్ రికార్డులు
నాటి ఉర్దూను అర్థం చేసుకోవడంలో అధికారుల ఇబ్బంది
ఇంగ్లిష్లోకి అనువదించాలని లోకాయుక్త ఆదేశాలు
ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని తర్జుమా ప్రక్రియ
అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములు
దేవాదాయశాఖ భూములు (ఎకరాల్లో)
జిల్లా మొత్తం భూమి అన్యాక్రాంతం
మేడ్చల్ 4,125.03 2,888.18
రంగారెడ్డి 9,360.01 1,148.15
హైదరాబాద్ 5,718.01 2,374.25
వికారాబాద్ 2,294 444.16
ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసులు
2010 నుంచి ఇప్పటి వరకు నమోదైనవి 2,100
ఇప్పటి వరకు పరిష్కారమైనవి 1,365
ఇప్పటికీ పెండింగ్లో ఉన్నవి 735
హైదరాబాద్లో ఉన్న పెండింగ్ కేసులు 140
సికింద్రాబాద్లో పెండింగ్లో ఉన్న కేసులు 66
రంగారెడ్డి జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులు 249
ఇప్పటి వరకు తర్జుమా అయిన ముంతకబ్లు 1,013
అనువాదం పూర్తికాని రికార్డులు 1,000పైనే