
కాలువ కబ్జాపై నిలదీత
ఇబ్రహీంపట్నం రూరల్: దాతర్ చెరువు నుంచి వచ్చే వరద కాలువ కబ్జాకు గురైందని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదని ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్వాసులు మండిపడ్డారు. చెరువు నుంచి వచ్చే వరద కాలువ, పక్కనున్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేయడంతో సోమవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే వద్దకు భారీగా వచ్చిన స్థానికులు అధికారులను నిలదీశారు. ప్రభుత్వ భూములు, శ్మశాన వాటికలు, కాలువలను కబ్జా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ డీఈ చెన్నకేశవరెడ్డి, ఏఈ హరితలు వచ్చి సందర్శిస్తుండగా వారిపై పలు ప్రశ్నలు గుప్పించారు. కాలువ విస్తీర్ణం ఎంత, సైజులు ఏమయ్యాయి అని అడగ్గా.. సర్వే చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ క్రమంలో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. రియల్టర్ల కోసమే ఇష్టం వచ్చినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కబ్జాకు గురైన కాలువను కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకొవాలని కోరారు.
కొంగరకలాన్లో అధికారులు
సర్వే చేస్తుండగా స్థానికుల మండిపాటు