
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
మంచాల: డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని లింగంపల్లి గేట్ వద్ద సీపీఎం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. మంచాల, నోముల, లింగంపల్లి గ్రామాలకు చెందిన నిరు పేదలను గత ఏడాదిన్నర క్రితమే డబుల్ బెడ్రూం లబ్ధిదారులుగా గుర్తించారన్నారు. నేటికి వాళ్లకు ఇళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. ఇళ్లల్లో విద్యుత్, ప్లంబింగ్, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అధికారులు సరైన సమాధానం ఇవ్వక పోతే లబ్ధిదారులే స్వయంగా ఇళ్లల్లోకి పోతారని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకట ప్రసాద్ అక్కడకు చేరుకొని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని నేతలు భీష్మించారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడి తహసీల్దార్ ఈ నెల 23న డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారందరూ ధర్నా విరమించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్యాం సుందర్, బుగ్గరాములు, కృష్ణ, జగన్, ఆర్.జంగయ్య, బాలరాజ్, బీఆర్ఎస్ నాయకులు పరమేష్, మహేందర్, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.