
అలుపెరగని పోరాటంతోనే వర్గీకరణ
షాద్నగర్రూరల్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సారథ్యంలో అలుపెరగని పోరాటంతోనే వర్గీకరణ సాధించుకున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని దూసకల్లో ఆదివారం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. 30ఏళ్ల ఎమ్మార్పీఎస్ పోరాటం, దండోరా ఉద్యమ చరిత్రను దళిత జాతికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా వర్గీకరణ ఉద్యమానికి సహకరించిన అన్ని కులాల పెద్దలను ఆహ్వానించి సత్కరించనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ, నాయకులు బాలరాజు, శ్రీకాంత్, రాజు, మల్లేష్, శ్రీకాంత్, నరహరి, శేఖర్, శ్రీశైలం, రాహుల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్