ఇబ్రహీంపట్నం: పన్నుల వసూళ్లకు వారం రోజులే గడువుంది. దీంతో మున్సిపాలిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.50 కోట్లు లక్ష్యం కాగా అందులో పాత బకాయిలే రూ.7 కోట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.4.10 కోట్లు (48 శాతం) మాత్రమే వసూలు చేయగలిగారు. గృహ, వాణిజ్య, వ్యాపార, విద్య, వైద్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారు 7,239 భవనాలకు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల బకాయిలు పక్కన పెడితే ప్రైవేట్ ప్రాపర్టీ పన్నులు రూ.9 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో బకాయిలు రూ.4.50 కోట్లు ఉన్నాయి. ఈ నెల 31వ తేదీలోపు లక్ష్యం పూర్తి కావాల్సి ఉంది. పేరుకుపోయిన ప్రైవేట్ ప్రాపర్టీల రూ.4.50 కోట్లు, ప్రభుత్వ సంస్థల రూ.2.50 కోట్ల పాత బాకాయిల వసూలు మున్సిపల్ యంత్రాంగానికి సవాల్గా మారింది.