ప్రచార రథం
ప్రచార హోరుకు రథాలు ముస్తాబు
● ఆయా పార్టీల ప్రత్యేక దృష్టి
● అత్యాధునిక హంగులతో తయారు
● ఓటర్లను ఆకట్టుకునేలా సిద్ధం
● రూ.లక్షల్లో ఖర్చు చేసేందుకు వెనుకాడని అభ్యర్థులు
యాచారం: ఎన్నికలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రచారమే.. ఓటర్లను అన్ని రకాలుగా ఆకర్షించేందుకు ఎవరి శైలిలో వారు ప్రచారం సాగిస్తుంటారు.. ఈ ప్రచార ఘట్టంలో ప్రస్తుతం ప్రధాన భూమిక పోషిస్తున్నాయి ప్రచార రథాలు. అందుకే చూడగానే ఆకట్టుకునేలా అభ్యర్థులు పోటాపోటీగా వీటిని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తమ అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ తొలిజాబితా ప్రకటించడంతో ఆయా పార్టీ అభ్యర్థులు ప్రచారం షురూ చేశారు. బీజేపీ, బీఎప్పీ, వామపక్షాలు తమ అభ్యర్థులు అధికారికంగా ప్రటించకపోయినప్పటికీ ఆశావహులు.. ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. ఎవరికి వారు తమ ప్రచారం విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. జనాన్ని ఆకర్షించేందుకు ప్రచార రథాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఇందు కోసం రూ.లక్షల్లో ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
ఓటర్లను ఆకట్టుకునే రీతుల్లో ..
పోటీ అభ్యర్థులు ప్రచార రథాలను వినూత్నంగా, ఓటర్లను ఆకట్టుకునే రీతుల్లో తయారు చేయించుకుంటున్నారు. గతంలో జీపులు, ఆటో రిక్షాలకు సాధారణ మైకులు పెట్టుకొని గ్రామాల్లో, కాలనీల్లో తిరిగి ప్రచారాలు సాగించే వారు. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. ప్రచారరథం పైకి ఎక్కితే సకల సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. 250 వాట్స్ల ఆహుజ మైక్, రథానికినాయకుల చిత్రపటాలు, కార్డులెస్ మైకు, కార్డుతో కూడిన మైకు రథంపై ఐదు నుంచి పది మంది ముఖ్యులు నిల్చొనేలా డయాస్, టైటిల్స్, చుట్టూ రెయిలింగ్స్, వాటర్ప్రూఫ్ కార్పెట్లు, పైన నిలబడి మాట్లాడే నాయకుడు కనిపించేలా ఎల్ఈడీలైట్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నుంచి వీటిని ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు.
సుజికి ఫేమస్..
ప్రచార రథాల తయారీకి సుజికి వాహనాలను ఎక్కువగా వాడుతున్నారు. రాజకీయ నాయకుల ప్రచారానికి ఇవి అనుకూలంగా ఉంటున్నాయి. గతంలో ప్రచారంలో ఉన్న మహేంద్ర, బొలేరో వాహనాలకు బదులు వీటిని వినియోగిస్తున్నారు. తమ పార్టీల అధినేతల ఫొటోలు, గుర్తులతో ఆకర్షించేలా రథాలను తయారు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ వాహనాలు 16 దేశాల్లో ప్రధానంగా క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వాహనాలను కొనుగోలు చేస్తే రోడ్డు టాక్స్ మినహాయించడంతో ఎక్కువగా కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
రూ.లక్షల ఖర్చుతో..
జిల్లాలోని పలు నియోజవర్గాల్లో వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే నేతలు రూ.లక్షల్లో ఖర్చు చేసి ప్రచార రథాలను తెప్పించుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వీటి కోసం వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, షాద్నగర్, చేవెళ్ల, మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నేతలు వీటిని సమకూర్చుకుంటున్నారు. ప్రచార రథాలతో పా టు కళాకారుల బృందాలను సిద్ధం చేసుకుంటు న్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల తుది జాబితా లు ఖరారు కాగానే ప్రచారం ఊపందుకోనుంది.