వేములవాడరూరల్: రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతోపాటు పండించిన ధాన్యం కొంటున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు ఇక విత్తనోత్పత్తిని చేపట్టనున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సొసైటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ప్రణాళిక రూపొందించి నాబార్డు సహకారంతో విత్తనాలను తయారు చేసి సొసైటీల ద్వారా రైతులకు చేరవేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈనెల 20న కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక సమావేశమయ్యారు. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 12 సొసైటీల్లో విత్తనోత్పత్తి చేయాలని నిర్ణయించారు.
12 సొసైటీల్లో పైలట్ ప్రాజెక్టుగా..
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఒక్కో జిల్లా నుంచి మూడే సొసైటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాజన్నసిరిసిల్లలో వేములవాడ, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కరీంనగర్ జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట, జగిత్యాల జిల్లాలో రాయికల్, జైన, బీర్పూర్, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, నందిమేడారం, ఎలిగేడు ప్రాథమిక సహకార కేంద్రాలను ఎంపిక చేశారు. పీఏసీఎస్ పరిధిలో 5 నుంచి 10 ఎకరాల వరకు నాణ్యమైన విత్తనోత్పత్తి చేయనున్నారు. విత్తనోత్పత్తిపై రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు. సీడ్ ఉత్పత్తి తర్వాత రైతుల నుంచి పీఏసీఎస్ కొనుగోలు చేసే సొంత బ్రాండ్తో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు.
ఇప్పటికే ఎరువులు, విత్తనాల సరఫరా
ధాన్యం కొనుగోళ్లతో తోడ్పాటు
రైతుల అభివృద్ధిలో సహకార సంఘాలు
ఉమ్మడి జిల్లాలో 12 సొసైటీలు ఎంపిక


