సిరిసిల్ల: జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 23 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశాలతో అదనపు ఎస్పీ చంద్రయ్య గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై ఆయా ఠాణాల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితుల సమస్యలపై చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు.
సర్పంచ్ జీతం సర్కారు బడికి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లి సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ తన ఐదు నెలల వేతనం రూ.32,500 ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం విరాళంగా ప్రకటించారు. తన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు తన వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కాగా ప్రైవేట్ పాఠశాలల నుంచి నలుగురు విద్యార్థులు ప్రభుత్వ బడిలో చేరారు. విద్యార్థుల తల్లిదండ్రులను సర్పంచ్, ఉపాధ్యాయులు అభినందించారు.
ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా 302 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు స్లాట్స్ బుక్ చేసుకున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుక్ చేసుకున్న తేదీ నాడు, సమయానికి కాలేజీలో హాజరుకావాలని సూచించారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్(ఐఐఐడీ) హైదరాబాద్ రీజినల్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్థపత్య ఉత్సవ్ 2.0’ డిజైన్ అండ్ క్రాఫ్ట్లో సిరిసిల్ల తెలంగాణ గిరిజన సంక్షేమ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. చేరియల్ పెయింటింగ్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, వుడ్ క్రాఫ్ట్ వర్క్షాప్లలో విద్యార్థినులు పాల్గొన్నారు. అధ్యాపక బృందాన్ని అకాడమీ ప్రిన్సిపాల్ జయ, వైస్ ప్రిన్సిపాల్ రెహానా ఇఫ్ఫత్ అభినందించారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) డిప్యూటీ డీఎంహెచ్వో పవిత్ర సోమవారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న మాతా శిశు సంక్షేమం, జాతీయ ఆరోగ్య, వ్యాధి నియంత్రణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఆస్పత్రిలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. మెడికల్ అధికారి చంద్రికారెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్ల: జిల్లాలో సోమవారం చిరు జల్లులు కురిశాయి. అత్యధికంగా బోయినపల్లిలో 25.8 మిల్లీమీటర్లు, తంగళ్లపల్లిలో 12.0, సిరిసిల్లలో 11.0, కోనరావుపేటలో 10.8, వేములవాడలో 3.8, వేములవాడ రూరల్లో 1.3, చందుర్తిలో 0.8, ఇల్లంతకుంటలో 0.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.


