గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలకేంద్రంలోని సీతారామస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ శనివారం సందర్శించారు. సిరిసిల్ల రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ ఉన్నారు. ఆలయ ప్రాముఖ్యాన్ని తెలుసుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి పేర్కొన్నారు. పట్టణ శివారులోని రగుడు వద్ద ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశాలతో శనివారం తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లు గల వాహనాలను సీజ్ చేయాలని విధుల్లో ఉన్న సిబ్బందికి సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు గసికంటి శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. 2028 ఆగస్టు 31లోపు ఇన్సర్వీస్ టీచర్స్ టెట్ క్వాలిఫై అయ్యేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చిందని, రాష్ట్రంలో 30 వేల మంది టీచర్లు టెట్ పాస్ కావాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు లెంకల జయకృష్ణారెడ్డి, ఒడ్నాల జగన్మోహన్, కటకం శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, గోశికొండ శ్రీనివాస్, కనుకుంట్ల మధు, బాలసంకుల ప్రవీణ్, అరిశేనపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
సిరిసిల్లటౌన్: బీడీ పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీ.వై.నగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మికభవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీడీ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సెస్ వెల్ఫేర్ బోర్డును కేంద్రం రద్దు చేసిందన్నారు. బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి అమలు చేయాలని, రిటర్మెంట్ పెన్షన్ను నెలకు రూ.6వేలు చెల్లించాలని కోరుతూ జూలై 29న కలెక్టరేట్ల ముందు ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేశ్చంద్ర, నాయకులు మూషం రమేశ్, సూరం పద్మ, దాసరి రూప, జిందం కమలాకర్, బోనాల లక్ష్మి, గురజాల మమత పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఏడుగురు విద్యార్థినులు ‘అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్’ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. ఏటా రూ.30 వేలు చొప్పున మూడేళ్లపాటు ఉపకారవేతనం అందనుంది. కళాశాల ప్రిన్సిపాల్ జి.జయ మాట్లాడుతూ ఇప్పటికే బీఎస్సీ లైఫ్ సైన్సెస్ నుంచి జి.వైష్ణవి రూ.30వేలు, ఎం.సంగీత, ఎం.కావేరి, ఎం.శ్రావణ్య రూ.15వేలు, బీఎస్సీ ఎంపీసీఎస్ నుంచి బి.ఆర్తి, కె.సానియా రూ.15వేలు, బీఏ విద్యార్థిని బి.స్వప్న రూ.15వేల స్కాలర్షిప్ అందుకున్నారని తెలిపారు.


