సిరిసిల్లలో ‘స్వచ్ఛ పాఠశాల’ నిర్వహించిన కేంద్ర మంత్రి టెన్త్ విద్యార్థులకు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లిస్తా, సైకిళ్లు ఇస్తా తరగతి గదిని శుభ్రం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్
సిరిసిల్ల: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ శనివారం ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్లో ‘స్వచ్ఛ పాఠశాల’ పేరుతో తరగతిగదులను శుభ్రం చేశారు. చీపురు పట్టి తరగతిగదులను ఊడ్చారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘స్వచ్ఛ పాఠశాల’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలలను పరిశుభ్రం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
విద్యార్థులకు సైకిళ్లు ఇస్తా
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చించాలని కోరుతూ రేపు గ్రామాలు, మండలాల వారీగా ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు కేంద్రం మంత్రి సంజయ్ తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులకు ఈసారి కూడా సైకిళ్లు అందించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే వారి పరీక్ష ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుసుమ రామయ్య స్కూల్లోని ఎన్సీసీ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మంత్రి ఫొటోలు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ నాయకులు బర్కం లక్ష్మి, నవీన్యాదవ్, అన్నల్దాస్ వేణు తదితరులు పాల్గొన్నారు.


