● దేశ సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం ● ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ● సిరిసిల్ల, వేములవాడల్లో బీఎల్ఏలకు అవగాహన
సిరిసిల్లటౌన్/వేములవాడ: పన్నేండేళ్లుగా దేశాభివృద్ధిని గాలికొదిలేసి బీజేఫీ ఫక్తు ఓట్ల రాజకీయం చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ విమర్శించారు. సిరిసిల్ల, వేములవాడల్లోని ఫంక్షన్హాళ్లలో శుక్రవారం నిర్వహించిన బీఏల్ఏల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంగ్లేయుల నుంచి దేశాన్ని కాపాడేందుకు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోరాడిందని, నేడు ఓట్ల చోర్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ చెర నుంచి దేశాన్ని కాపాడేందుకు మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాల్సి తరుణం ఆసన్నమైందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు నెహ్రూతో మోదీ పోల్చుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు. పన్నెండేళ్లుగా దేశానికి బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. మోదీ ఈడీ, సీబీఐలను నమ్ముకొని పాలన చేస్తున్నారన్నారు.
బీఎల్ఏల శక్తి ఎవరికీ లేదు
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బీఎల్ఏలకున్న శక్తి ఎవరికీ లేదని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. అందరూ కలిసి పనిచేస్తే సిరిసిల్లలో ఎమ్మెల్యేగా గెలవడం తేలికని పేర్కొన్నారు. బీజేపీ ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్ష ఓట్లను తొలగించే ప్రయత్నం మానుకోవాలని సూచించా రు. మీనాక్షి నటరాజన్పై కేసు లేకున్నా నామినేషన్ రిజెక్టు చేసి ఆమె సీటును బీజేపీ చోరీ చేసిందన్నారు. రాహుల్గాంధీని ప్రధాని చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. దశాబ్దకాలం అధికారంలో ఉన్నా కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతాన్ని వెనక్కి నెట్టారని ఆరోపించారు. నేతన్నలకు వారు పెట్టిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, గోపిశెట్టి రాఘవేందర్, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్మన్ రాజు పాల్గొన్నారు.


