● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రుద్రంగి(వేములవాడ): ప్రజా ప్రభుత్వంలో రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్నలకు క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రుద్రంగి సబ్స్టేషన్లో ఇటీవల ఒక బ్రేకర్ అమర్చినట్లు తెలిపారు. తహసీల్దార్ పుష్పలత, ఎస్సై మోతీరాంనాయక్, సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాశ్, డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


