అస్సాం: అగ్గి రాజేస్తున్న 40 ఏళ్ల నాటి ఒప్పందం | 40-Year-Old Promise That Still Haunts Every Election | Sakshi
Sakshi News home page

అస్సాం: అగ్గి రాజేస్తున్న 40 ఏళ్ల నాటి ఒప్పందం

Apr 8 2026 9:40 AM | Updated on Apr 8 2026 9:43 AM

40-Year-Old Promise That Still Haunts Every Election

గౌహతి: అస్సాం ఎన్నికల వేడి తారాస్థాయికి  చేరింది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు 40 ఏళ్ల నాటి  ‘అస్సాం ఒప్పందం’ ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మారింది. ఇంతకీ నాడు ఏం జరిగింది? ఎందుకు ఇప్పటికీ ఆ ఒప్పందమే అస్సాం ఎన్నికల తలరాతను శాసిస్తోంది?

‘అస్సాం ఒప్పందం’ 1985 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ), ఏఏజీఎస్‌పీల మధ్య  కుదిరింది. మార్చి 25, 1971 తర్వాత రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను గుర్తించి, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించి, బహిష్కరించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అయితే 40 ఏళ్లు గడుస్తున్నా ఏ ప్రభుత్వమూ దీనిని చిత్తశుద్ధితో అమలు చేయలేదని, సరిహద్దుల గుండా చొరబాట్లను అడ్డుకోకపోవడం వల్ల అస్సామీల ఉనికికే ముప్పు వాటిల్లుతోందని ఏఏఎస్‌యూ తీవ్రంగా విమర్శిస్తోంది.

అస్సాం ప్రజల గుర్తింపును కాపాడే జస్టిస్ బిప్లబ్ కుమార్ శర్మ కమిటీ (క్లాజ్ 6) సిఫార్సులను అమలు చేసేందుకు అడుగులు వేశామని రాష్ట్ర మంత్రి అతుల్ బోరా చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నాయి. బీజేపీ సర్కారు కావాలనే ఈ ఒప్పందాన్ని పక్కనపెట్టి, పౌరసత్వ సవరణ చట్టం  తీసుకొచ్చిందని కాంగ్రెస్, అస్సాం  జాతీయ పరిషత్ (ఏజేపీ) మండిపడుతున్నాయి. 2014కి ముందు ఒప్పందాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. తీరా అధికారంలోకి వచ్చాక 1971 తర్వాత వచ్చిన అక్రమ బంగ్లాదేశీయులకు సీఏఏ ద్వారా స్వాగతం పలుకుతోందని ఏజేపీ ఆరోపిస్తోంది.

ఈ వివాదంపై 2024 అక్టోబర్ 17న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ, మార్చి 25, 1971ని సరైన కట్-ఆఫ్ తేదీగా తేల్చింది. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా అస్సాంలో మాత్రమే ఉన్న ‘డీ-ఓటర్ (పౌరసత్వంపై అనుమానం ఉన్నవారు) విధానాన్ని 1997లో ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. భారత పౌరులుగా సరైన ఆధారాలు చూపించలేని వారి పేర్ల ముందు ‘డి’ అని చేరుస్తారు. ఫారినర్స్ ట్రిబ్యునల్స్, న్యాయస్థానాల తీర్పుల ఆధారంగా వీరిని ఓటరు జాబితా నుంచి తొలగించడం లేదా పౌరులుగా గుర్తించడం జరుగుతుంది.

2026, ఏప్రిల్ 9న ఒకే విడతలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ కూటమి (ఎన్‌డీఏ), కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనున్న ఈ ఎన్నికల్లో.. ఎవరి రాజకీయ భవితవ్యాన్ని ఈ ‘అస్సాం ఒప్పందం’ ఏ తీరుగా మారుస్తుందో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: వైట్ హౌస్ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్ గద్దె దిగాలంటూ నిరసనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement