బీఆర్ఎస్ నేతల్లో సన్నగిల్లని ఆశలు ఇప్పటికే నలుగురు పేర్లు ప్రకటన 13న మున్సిపల్ సమావేశానికి సన్నాహం అమెరికా పర్యటనలో కేటీఆర్
సిరిసిల్లటౌన్: బల్దియాలో నెలకొన్న కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎంపికలో అధిష్ఠానం నిర్ణయంపై ఆశావహుల్లో విమర్శలున్నా కేటీఆర్పై ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నలుగురు పేర్లను పార్టీ పెద్దలు ప్రకటించగా కొందరు దానికి కట్టుబడి ఉండగా మరికొందరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకంతో నామినేషన్లు వేశారు. నాలుగు కోఆప్షన్ స్థానాలకు బీఆర్ఎస్ నుంచి 13 నామినేషన్లు రావడంతో రాజకీయ రసకందాయంపై కథనం.
4 పదవులు.. 13 నామినేషన్లు
సిరిసిల్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నియామకా నికి నామినేషన్ల దరఖాస్తుకు మంగళవారంతో గడు వు ముగిసింది. మున్సిపల్పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడంతో ఆ పార్టీకి చెందిన వారే కోఆప్షన్ సభ్యులుగా కౌన్సిల్ ఎన్నుకోనుంది. చాలా రోజు లుగా పదవులు ఆశిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, యువనాయకులు, సీనియర్ నాయకులు కేటీఆర్ తమకు కోఆప్షన్ అవకాశం ఇస్తారని నమ్మకంతో ఉంటున్నారు. బీఆర్ఎస్ నుంచి 13 నామినేషన్లు దాఖలయ్యాయి. జనరల్ స్థానం నుంచి పోటీలో ఉన్న నంది శంకర్(2) నామినేషన్లు దాఖలు చేయగా మిగతా వారు కొండ అనూష, గుగ్గిళ్ల అంజయ్య, పాతూరి రాజిరెడ్డి, గడ్డం కళావతి ఒక్కో నామినేషన్ సమర్పించారు. మైనార్టీ నుంచి రెండు పదవులకు ఎం.డి.ఆస్మా, అంజద్ అలీ, సయ్యద్ తస్లీం, ఎం.డి. అఫ్రోజ్, షేక్ భాషు, షేక్ ముస్కాన్లు నామినేషన్లు వేసినట్లు కమిషనర్ ఖదీర్పాషా తెలిపారు.
కేటీఆర్పై గంపెడాశలు
గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంలో 39 వార్డుల్లో 27 మంది పార్టీ అభ్యర్థులు గెలిచారు. చైర్పర్సన్గా జిందం కళ, వైస్చైర్మన్గా దార్ల సందీప్లను కేటీఆర్ నియమించారు. ఇక మిగిలింది మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రమే. కోఆప్షన్ నోటిఫికేషన్ రావడంతో మాజీ ప్రజాప్రతినిధులు, తాజా నేతలు ఆయా పదవులపై కన్నేశారు. కాగా ఇటీవలే పార్టీ పెద్దలు కోఆప్షన్ సభ్యులుగా మాజీ కౌన్సిలర్లు కొండ అనూష, సయ్యద్ తస్లీం, నంది శంకర్, యువ నాయకుడు సయ్యద్ సోహైల్ పేర్లను ప్రకటించారు. దీంతో ఇన్నిరోజులు ఆశగా ఉన్న నేతల్లో నిరాశ పేరుకుపోయింది. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ త్వరలోనే వస్తే.. కోఆప్షన్ సభ్యుల పేర్ల జాబితా మార్చుతారన్న ఆశతో మరికొందరు ఎదురుచూస్తున్నారు.
ఆ నలుగురి ప్రకటన ఇలా..
పార్టీకి విధేయులుగా ఉంటుండడంతోనే కొండ అనూష, సయ్యద్ తస్లీం, నంది శంకర్, సయ్యద్ సోహైల్ పేర్లను ప్రతిపాదించనట్లు తెలిసింది. కొండ అనూష, నంది శంకర్ కౌన్సిలర్గా పనిచేసి పార్టీ నిర్ణయం మేరకు తదుపరి ఎన్నికల్లో ఇతరులకు అవకాశం ఇచ్చారు. సయ్యద్ తస్లీం మైనార్టీ ఓట్లు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. సోహైల్ పార్టీకి మొదటి నుంచి యువనాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి సాధిఖ్ సైతం గతంలో కోఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు.
‘నేను దశాబ్దకాలంగా పార్టీకి విధేయంగా పనిచేస్తున్న. ఎన్నిక ఏదైనా పార్టీ గెలుపులో భాగస్వామ్యమవుతున్న. అయినా నాకు గుర్తింపు రాలేదు. పార్టీ నుంచి నా పేరు ప్రకటన రాకపోవడం బాధగా ఉంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి నామినేషన్ వేయలేదు. మీ నిర్ణయం మీదే ఉంది. ఇది ఓ సీనియర్ మైనార్టీ నేత ఆవేదన.’
‘అన్నా.. నేను రెండు సార్లు కౌన్సిలర్గా చేసిన. మూడోసారి టికెట్ వద్దంటే మీ మాటపై ఊరుకున్న. మా సేవలు గుర్తిస్తామన్నారు. నలుగురు ముందు మాటిచ్చారు. కోఆప్షన్ పదవి నాకు ఇస్తారనుకున్నాం. పార్టీ నుంచి అనధికారికంగా వచ్చిన ప్రకటనలో నా పేరు లేదు.’ ఇది పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆవేదన.’


