టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించిన ఈ ముంబైకర్.. జట్టును చాంపియన్గా నిలిపాడు. ఇక గతేడాది వేలంలో రూ. 26.75 కోట్లు పైగా వెచ్చించి పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.
పైసా వసూల్ ప్రదర్శన
ఈ క్రమంలో ఐపీఎల్-2025లో బ్యాటర్గా, కెప్టెన్గా పంజాబ్కు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). మొత్తంగా 17 మ్యాచ్లలో 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సారథిగా పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు.
ఇక ఐపీఎల్-2026 టోర్నీని కూడా శ్రేయస్ అయ్యర్ ఘనంగా ఆరంభించాడు. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్లలో జట్టును గెలిపించుకున్నాడు. బ్యాటర్గా రెండు మ్యాచ్లలో కలిపి 68 పరుగులు రాబట్టాడు. ఇదిలా ఉంటే.. గతేడాది దేశీ క్రికెట్లోనూ ముంబై తరఫున అయ్యర్ అదరగొట్టాడు.
అయినప్పటికీ భారత టీ20 జట్టుకు సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోనే లేదు. అయితే, పంజాబ్ కింగ్స్ పేసర్ వైశాఖ్ విజయ్కుమార్ మాత్రం శ్రేయస్ అయ్యర్ తప్పక టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని అంచనా వేశాడు. సారథి అయ్యేందుకు అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని కొనియాడాడు.
త్వరలోనే టీమిండియా కెప్టెన్ అవుతాడు
ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి బౌలర్, ప్రతి ఆటగాడికి అతడు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడు. బాగా ఆడినా.. ఆడకపోయినా వారికి అండగానే ఉంటాడు. ఆటగాళ్లకు కావాల్సింది ఇలాంటి కెప్టెనే.
టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా అతడు అత్యద్భుతంగా ఆడుతున్నాడు. కచ్చితంగా అతడు త్వరలోనే టీమిండియా కెప్టెన్ అవుతాడు’’ అని వైశాఖ్ విజయ్కుమార్ పేర్కొన్నాడు. కాగా వైశాఖ్ పంజాబ్ తరపున ఇప్పటికి రెండు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు.
ఇదిలా ఉంటే.. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా శ్రేయస్ అయ్యర్ 2023, డిసెంబరులో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు శ్రేయస్ అయ్యర్.
చదవండి: CSKకు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!


