తంగళ్లపల్లి(సిరిసిల్ల): మిషన్ వాత్సల్యలో భాగంగా మండలంలోని బద్దెనపల్లి జెడ్పీ హైస్కూల్లో మంగళవారం పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత మాట్లాడుతూ పిల్లల భవిష్యత్పై తల్లిదండ్రులు, సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనాథలు, విడిచిపెట్టిన పిల్లలు కనిపిస్తే 1098కు సమాచారం అందించాలని కోరారు. చైల్డ్ హెల్ప్లైన్ ప్రతినిధి శ్యామల, ఎంఈవో, హెడ్మాస్టర్ భూక్యా రాజునాయక్ పాల్గొన్నారు.
9న మినీ జాబ్మేళా
సిరిసిల్ల: కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కేంద్రంలో ఈనెల 9న మినీ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ మంగళవారం తెలిపారు. టాంకాం, శ్రీని అగ్రిల్యాబ్, సమర్థనం దివ్యాంగు ల సంస్థలు మినీ జాబ్మేళా నిర్వహిస్తున్నాయని వివరించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వేతనంతో ఉపాధి కల్పిస్తాయని తెలిపారు. విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఉపాధి కల్పన ఆఫీస్కు గురువారం ఉదయం 11 గంటలకు రావాలని కోరారు. వివరాలకు 79891 80001, 63648 63213, 98853 46768లో సంప్రదించాలని సూచించారు.
‘ప్రజాబాట’తో విద్యుత్ సమస్యల పరిష్కారం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాబాట నిర్వహిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సిరిసిల్ల డివిజన్ ఇంజినీర్ అంజయ్య తెలిపారు. మండలంలోని లక్ష్మీపూర్లో మంగళవారం విద్యుత్ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. అంజయ్య మాట్లాడుతూ ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు వంటి పనులు చేపడుతున్నట్లు వివరించారు. గ్రామంలో లో–వోల్టేజీ సమస్య ఉందని, అదనంగా రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఉపసర్పంచ్ చీమల పరుశురాం, ఏడీఈ గోపి, ఏఈ మధుకర్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలు, విద్యుత్ శాఖ ప్రతినిధులు కుశాల్, భూపతిరెడ్డి, రైతులు మల్లారెడ్డి, శంకర్, అజయ్, కరుణాకర్రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.
మూల్యాంకన భత్యం చెల్లించాలి
సిరిసిల్లటౌన్: పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ భత్యం, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టీటీజేఏసీ, యూఎస్పీసీ, జాక్టో ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సిరిసిల్లలోని మూల్కాంకన కేంద్రం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో మంగళవారం మెరుపు సమ్మె చేపట్టారు. 2025 మార్చిలో నిర్వహించిన ఎస్సెస్సీ స్పాట్ రెమ్యూనరేషన్, అక్టోబర్ 2024లో నిర్వహించిన కులగణన రెమ్యూనరేషన్ బిల్లులు ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎడ్ల కిషన్, బోయన్నగారి నారాయణ, గుండమనేని మహేందర్రావు, జంగిటి రాజు, అవురం సుధాకర్రెడ్డి, వంగ తిరుపతి, వికృతి అంజయ్య, రేవోజు సదానందం, మొగిలి లక్ష్మణ్ పాల్గొన్నారు.
పట్టుపరిశ్రమ కేంద్రం సందర్శన
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కోళ్లమద్దిలో గల పట్టుపరిశ్రమ కేంద్రాన్ని మంగళవారం పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. పట్టుపరిశ్రమ పరిధిలోని భూమిని, మల్బరీ సాగుకు అనువైన స్థలాన్ని గుర్తించారు. మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం తదితర అంశాలపై చర్చించారు. బెంగళూర్, మైసూర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మల్లికార్జున్, వినోద్యాదవ్, సెరీకల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ లత, ఏడీ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


