ఏటీసీకి పరిపాలన అనుమతులు | - | Sakshi
Sakshi News home page

ఏటీసీకి పరిపాలన అనుమతులు

Jun 19 2025 4:26 AM | Updated on Jun 19 2025 4:26 AM

ఏటీసీ

ఏటీసీకి పరిపాలన అనుమతులు

రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) కళాశాలకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రకటనలో తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌లో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కోర్సులు ఉంటాయని పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌ 48, ఆర్టీసియన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్‌ 20, బేసిక్‌ డిజైనర్‌, వర్చువల్‌ వెరిఫయర్‌ 48, ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌, డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌ 40, మెకానిక్‌ ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ 48, మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌ 40 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గల్ఫ్‌ వెళ్లేవారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెంపొందించేందుకు అవకాశం, యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు దొరికేందుకు ఏటీసీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ఫారెస్ట్‌ అధికారులను అడ్డుకున్న రైతులు

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని రంగంపేట గ్రామంలో అటవీశాఖ భూమిలో చెట్లు నాటేందుకు గాను సర్వే చేసేందుకు బుధవారం ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది రాగా రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 30 ఏళ్లుగా ఆ భూమిని సాగుచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి బీసీలమైన తమకు పట్టాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమపై దయచూపి పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. రైతులు ఎదురుతిరగడంతో ఫారెస్టు అధికారులు చేసేదేమీ లేక ప్లాంటేషన్‌ సర్వే చేయకుండానే వెనుదిరిగారు. ఎఫ్‌ఎస్‌వో పద్మలతను వివరణ కోరగా, సిరిసిల్ల ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీహరిప్రసాద్‌ ఆదేశాల మేరకు రంగంపేటలో పోడు భూమిలో సర్వే కోసం వచ్చామన్నారు.

కూల్చివేతలు ముమ్మరం

వేములవాడ: వేములవాడలో రోడ్ల వెడల్పు ప్రక్రియ బుధవారం మూడోరోజు కొనసాగింది. భారీ ఎగ్జావేటర్లతో రెండు, మూడు అంతస్తుల భవనాలను నేలమట్టం చేశారు. మొత్తం 148 భవనాలను పూర్తిగా కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. 10 మంది తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడి తమకు సూచించిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు తమతమ సామగ్రిని సర్దుకునే ప్రయత్నంలో మునిగితేలారు.

ఒలింపిక్స్‌ వారోత్సవాలు

సిరిసిల్ల: కేంద్రంలో బుధవారం ఒలింపిక్స్‌ వారోత్సవాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 23 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు జూనియర్‌ కళాశాల మైదానంలో వాకర్స్‌తో కలిసి వాకింగ్‌ నిర్వహించారు. అందరిలోనూ క్రీడాస్ఫూర్తిని నింపేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా యువజన, క్రీడల అధికారి ఆజ్మీరా రాందాస్‌ తెలిపారు. ఎంఈవో దూస రఘుపతి, యోగా మాస్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, వస్త్రోత్పత్తిదారులు, యువకులు పాల్గొన్నారు.

రైతు భరోసా రూ.73.85 కోట్లు జమ

సిరిసిల్ల: జిల్లాలోని 97,841 మంది రైతులకు రైతు భరోసా పథకంలో రూ.73.85 కోట్లు బుధవారం నాటికి జమ అయ్యాయని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. వానాకాలం సీజన్‌ సాగు పెట్టుబడి కోసం ఎకరానికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. మూడు రోజుల్లో రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.73,85,58,689 డబ్బులు జమయ్యాయని పేర్కొన్నారు.

ఏటీసీకి పరిపాలన అనుమతులు1
1/2

ఏటీసీకి పరిపాలన అనుమతులు

ఏటీసీకి పరిపాలన అనుమతులు2
2/2

ఏటీసీకి పరిపాలన అనుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement