
నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలి
వేములవాడ: వేములవాడ పట్టణంలో రోడ్ల వెడల్పులో భాగంగా నిర్వాసితులపట్ల అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామనీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఏళ్ల తరబడిగా ఉన్న దుకాణాలు, నివాసాలు కోల్పోతున్నవారికి మానవీయ కోణంలో కనీస గడువు, సరైన పరిహారం ఇవ్వకుండా అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రహదారి విస్తరణకు తాము వ్యతిరేకం కాదని నిర్వాసితులు పదే పదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే అధికారులతో చొరవచూపాల్సింది పోయి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. పరిహారం ఇవ్వకముందే ఇల్లు, దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాచరిక పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. గోశాల విషయంలో తాము నిలదీయడం వల్లే యంత్రాంగం కదిలిందని, వేములవాడలో 100 ఎకరాల్లో గోశాల ఏర్పాటుకు సీఎం చొరవ చూపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. క్రాంతికుమార్, పోలాస నరేందర్, నిమ్మశెట్టి విజయ్, జోగిని శంకర్, నరాల శేఖర్, గోలి మహేశ్ తదితరులు ఉన్నారు.