
టీకా వేసిన తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాలి
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):: వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులను నిర్లక్ష్యంగా నిర్వహించినా, సమయ పాలన పాటించకపోయినా సీసీఏ రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని చిన్నబోనాల, పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. 0–5 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు టీకాలు వేసినప్పుడు వెంటనే వారిని ఇంటికి పంపించకుండా రెండు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుకోవాలని సూచించారు. టీకాలు వేసిన పిల్లలను మరో రెండు రోజుల పాటు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించాలన్నారు. ఆమె వెంట డీఐవో డాక్టర్ సంపత్కుమార్, డాక్టర్ నహీంజహా, సిబ్బంది ఉన్నారు.