
భూముల సర్వేకు గ్రహణం
● ఎండాకాలంలో సర్వేయర్లకు డిప్యూటేషన్ ● జిల్లా సర్వే అధికారి, డీఐలు ఇన్చార్జీలే.. ● వేధిస్తున్న కొరత.. రైతులకు తప్పని తిప్పలు
ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాం
నర్సింగాపూర్ రెవెన్యూ శివారులో 422, 424 సర్వే నంబర్లలో భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని 2020లో ఏడీ సర్వేయర్కు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు సర్వేకు రాలేదు. హద్దులు చూపించలేదు. ఐదేళ్లుగా భూమి సర్వే కోసం ఎదురుచూస్తున్నాం.
– మొకిడి మారుతి, వెంకట్రావుపల్లి
బోయినపల్లి(చొప్పదండి): వానాకాలంలో పంటల సాగుకు ముందే భూముల సర్వే చేయించుకుందామనుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. జిల్లాలో తగినంత మంది సర్వేయర్లు లేక దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఉన్న కొద్ది మంది సర్వేయర్లు ఎండాకాలంలో ప్రభుత్వ పనులపై వెళ్లారు. దీంతో జిల్లాలో భూముల సర్వే పడకేసింది. భూసర్వేకు దరఖాస్తు చేసి ఏళ్లు గడిచినా సర్వేయర్లు రావడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో సుమారు 91,416 సర్వేనంబర్ల పరిధిలో 4,68,532 ఎకరాల భూములు ఉన్నాయి.
సర్వేయర్ల కొరత
ఒక్కో సర్వే నంబర్కు ఒక్కో టిపన్ ఉంటుంది. టిపన్లో సర్వేనంబర్ భూ విస్తీర్ణం మ్యాప్ ఉంటుండగా, దీని ఆధారంగా సర్వేయర్లు భూములను సర్వే చేస్తారు. రైతులు తమ భూములు సర్వే చేయాలని ఆన్లైన్లో చలాన్ చెల్లిస్తే తహసీల్దార్ ఆదేశాలతో సర్వేయర్ క్షేత్రస్థాయిలో సర్వేకు వస్తారు. అయితే జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. జగిత్యాల జిల్లా సర్వే అధికారి వెంకటరెడ్డి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇన్చార్జి అధికారిగా పనిచేస్తున్నారు. సిరిసిల్ల ఎల్ఏ డీఐ సిరిసిల్ల, వేములవాడ ఇన్చార్జి డీఐగా చేస్తున్నారు. జిల్లాలో ఏడుగురు మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. ఇందులో ఒకరు ఇటీవల ఏసీబీకి ట్రాప్ అయ్యారు.
డిప్యూటేషన్పై..
వేములవాడ టెంపుల్ రోడ్ల విస్తరణకు, భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా రుద్రంగికి సర్వేయర్లు ఇటీవల డిప్యూటేషన్పై వెళ్లారు. ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చేందుకు వెళ్తున్నారు. ఎండాకాలంలో భూములు ఖాళీగా ఉండడంతో సర్వేకు అనుకూలం. అయితే ఈ వేసవిలో సర్వేయర్లు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొత్తగా నియమితులయ్యే 156 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లు విధుల్లో చేరేసరికి వర్షాలు ఊపందుకొని.. సర్వే పనులకు ఆటంకం కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా సమాచారం
సర్వే అధికారి : 01 (ఇన్చార్జి అధికారి)
డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే : 03
(వేములవాడ, సిరిసిల్ల ఇన్చార్జి)
సర్వేయర్లు : 07 (ఒకరు ఏసీబీకి ట్రాప్)
సర్వే నంబర్లు : 91,416
భూమి విస్తీర్ణం : 4.68 లక్షల ఎకరాలు

భూముల సర్వేకు గ్రహణం