రెచ్చిపోతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలు బెట్టింగ్ వలలో చిక్కి అప్పులపాలవుతున్న యువకులు అప్పులు తీర్చేదారి తెలియక బలవన్మరణాలు దర్శిలో 25 మందికిపైగా యువకులు బెట్టింగ్కు బలై ఆత్మహత్యలు సీరియస్గా తీసుకున్న ఎస్పీ హర్షవర్ధన్రాజు 15 మంది సీఐలు, 25 మంది ఎస్సైలకు చార్జ్మెమో బెట్టింగ్ ముఠా కీలక సూత్రధారులు పరార్ ఇతర దేశాలకు వెళ్లారని అనుమానం
న్యూస్రీల్
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026
యువకుల క్రికెట్ మోజు..డబ్బు ఆశను అడ్డంపెట్టుకుని బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. బెట్టింగ్ వలలో చిక్కుకున్న యువకులు అప్పులపాలై అవి తీర్చే దారి తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల దర్శి కేంద్రంగా ఉన్న బెట్టింగ్ ముఠా గుట్టు రట్టవడంతో బెట్టింగ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులకు ఎస్పీ చార్జ్మెమో ఇచ్చారు. దీంతో అసలు సూత్రధారులు అప్రమత్తమై దేశం దాటేశారన్న ప్రచారం సాగుతోంది.
కాలం పూచిన తొలిపువ్వు
బెట్టింగ్ వల..
దర్శి:
దర్శి నియోజకవర్గంలో దర్శి కేంద్రంగా నిర్వహించిన బెట్టింగ్ తీగలాగితే బెట్టింగ్ రాయుళ్ల డొంక కదిలింది. ఇటీవల జరిగిన టీ 20 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసి కూపీలాగడంతో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ హర్షవర్థన్ రాజు మంగళవారం 15 మంది సీఐలు, 25 మంది ఎస్సైలకు చార్జ్మెమోలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఎస్పీ తీసుకుంటున్న చర్యలకు అవినీతి పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
తీగ లాగడంతో బుకీలు పరార్:
దర్శి కేంద్రంగా చేస్తున్న బెట్టింగ్ రాయుళ్ల ద్వారా నరసరావుపేటలో బెట్టింగ్కు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం, వారి వద్ద భారీ మొత్తంలో డబ్బు దొరకడం, వారి ద్వారా హైదరాబాద్లో మరో బెట్టింగ్ రాయున్ని కూడా అదుపులోకి తీసుకోవడంతో బెట్టింగ్ డొంక కదిలింది. దీంతో ప్రధానంగా బెట్టింగ్లు వేయించే బుకీలు గుట్టు చప్పుడు కాకుండా అడ్రస్ లేకుండా ఊళ్లు వదిలేసి వెళ్లిపోయారు. ఈ బెట్టింగ్ వ్యవహారంలో తెరవెనుక అసలు పెద్దలు ఉన్నవారిని పట్టుకునేందుకు ఎస్పీ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.
పది మంది అదుపులోకి..
మంగళవారం రాత్రి దర్శి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి 10 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలు వచ్చి వారిని ఒంగోలు తీసుకెళ్లారు. దీంతో పట్టణంలో ఒక్క సారిగా కలకలం రేగింది. ప్రధాన బెట్టింగ్ రాయుళ్ల ముఠాకు సంబంధించి జిల్లాలోని 14 మంది వరకు శ్రీలంక, ఇతర దేశాలకు వెళ్లినట్లు సమాచారం. అసలు దోషులను పట్టుకుంటారా లేక వారిని వదిలేస్తారా అన్న చర్చ సాగుతోంది.
– సాక్షి, ఒంగోలు
ఇప్పటి వరకు 25 మందికి పైగా బలవన్మరణాలు
దర్శి పట్టణంలో బెట్టింగ్కు అలవాటుపడిన యువకులు డబ్బు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి బెట్టింగ్లు పెట్టి రూ.లక్షల్లో నష్టపోయారు. దీంతో అప్పుల వాళ్ల ఒత్తిళ్లకు తట్టుకోలేక, అందరికీ తెలిస్తే ఆ డబ్బు ఏం చేశారో చెప్తే కుటుంబం పరువు పోతుందని, ఆ అప్పులు తీర్చేందుకు మళ్లీ మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్లు వేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు గత పదేళ్లలో దాదాపు 25 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేబుల్ వర్క్ చేసుకునే కుటుంబానికి చెందిన ఒక యువకుడు బెట్టింగ్లో భారీగా నష్టపోయి ఇంట్లో నుంచి పారిపోయాడు. అతను వెళ్లిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు.
సరుకుల కంపెనీలో పని చేసే ఓ యువకుడు బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ట్రాక్టర్ తోలుకుని జీవనం సాగించే వ్యక్తి కుమారుడు బెట్టింగ్ లకు పాల్పడి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి పెళ్లి అయి చిన్న పిల్లలు ఉన్నారు.
మరో సరుకుల రవాణాకు సంబంధించిన పని చేసే యువకుడు కూడా బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వ్యక్తి కూడా ఇదే బెట్టింగ్లకు బలయ్యారని చర్చించుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 20 నుంచి 30 సంవత్సరాల లోపు యువకులు పదుల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారు.


