మార్కాపురం: రాష్ట్రంలో అర్హులైన పేదలకు నివాస స్థలాలు, పక్కా గృహాలు, వ్యవసాయ కూలీలకు సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీ ఈశ్వరయ్య తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నివాస స్థలాల కోసం రాష్ట్రంలో నిరుపేదలు అనేక దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎన్నికలకు ముందు పదే పదే చెప్పిన చంద్రబాబు అధికారంలోనికి రాగానే వాగ్దానాలను గాలికొదిలేశారని చెప్పారు. పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల క్రితం టిడ్కో ఇళ్లు పూర్తయినా నేటికీ లబ్ధిదారులకు స్వాధీనం చేయకపోవడంతో అవన్నీ శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికై నా వాటిని లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు హామీలన్నీ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో భూ మాఫియా పేట్రేగిపోతోందని, ప్రజలు తమ ఆస్తులను రక్షించుకునేందుకు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డులు, పెన్షన్లు ఇస్తామని చెప్పిన కూటమి నాయకులు కొత్తవి ఇవ్వకపోగా అనర్హుల పేరుతో అర్హులను తొలగించారన్నారు. దళిత వాడల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, ఎస్కే యాసీన్, అందె నాసరయ్య, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్కె ఖాశీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


