● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 120 టన్నులకు పైగా నూనె విక్రయాలు
● అడ్డూ అదుపు లేని ప్లాస్టిక్ వస్తువుల ధరలు
● ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం
మార్కాపురం: పశ్చిమాసియా దేశాల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వంటిళ్లలో మంట పుట్టిస్తున్నాయి.! ఇరాన్తో అగ్ర రాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం వస్తు సేవల రంగాలపై ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరాలో అంతరాయం తలెత్తడంతో వివిధ వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూనె ధరలు ఒక్కసారిగా పెరిగి జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో లీటరు నూనె ధర రూ.5 నుంచి 10 రూపాయల మేర పెరిగింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజూ 120 టన్నులకు పైగా ఆయిల్ విక్రయాలు సాగుతున్నట్లు అంచనా. ఐదు రోజుల క్రితం ఒక రకం కంపెనీ ఆయిల్ ధర రూ.162 ఉండగా ప్రస్తుతం రూ.170కి పెరిగింది. మరోరకం ఆయిల్ ధర రూ.115 నుంచి రూ.125కి చేరింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూనె ధరలు దిగి రాకుంటే ఆహార పదార్థాల ధరలు పెంచక తప్పదని హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, టిఫిన్ బండ్లు మూత వేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గడిచిన వారం రోజుల వ్యవధిలో కూలింగ్ క్యాన్ల ధర రూ.450 నుంచి రూ.600కు బబుల్స్ రూ.130 నుంచి రూ.170కు, కవర్ల ప్యాకెట్ ధర రూ.175 నుంచి రూ.215కు ఎగబాకింది. గల్ఫ్ దేశాల నుంచి ముడిపదార్థాల దిగుమతికి అంతరాయం ఏర్పడటంతో ధరలపై ప్రభావం పడుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
నూనె ధరలు తగ్గించాలి
గత వారం రోజుల నుంచి నూనె ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలి. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు పెరుగుతూ పోతే సామాన్యులు బతకడం కష్టం. ప్లాస్టిక్ వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నారయి. అధికారులు స్పందించి కృత్రిమ కృత్రిమ గ్యాస్ కొరతను, ధరలను నియంత్రించాలి.
– కరీముల్లా, మార్కాపురం 17వ బ్లాక్ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి


