
పశువుల కాపరిని బలి తీసుకున్న చెరువు
టంగుటూరు: పశువుల కాపరిని చెరువు బలి తీసుకుంది. ఈ సంఘటన మండలంలోని వల్లూరు చెరువులో మంగళవారం జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు వల్లూరు చెరువులో భారీగా మట్టి తరలించారు. ఫలితంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడాయి. ఇటివల అడపాదడపా వర్షాలు పడగా ఆ గుంతల్లో నీరు చేరాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర పశువులు మేపేందుకు ఆ రాష్ట్రానికే చెందిన అరుణ్ (15) అనే యువకుడిని పనికి పెట్టుకున్నాడు. రోజూలాగే అరుణ్ పశువులను మేపుకొని తిరిగి వస్తున్న సమయంలో ఒక పశువు బురదలో ఇరుక్కుని పోయింది. ఆ పశువును తప్పించబోయి గుంతలో అరుణ్ జారిపడ్డాడు. చీకటి పడటంతో ఎవరూ గమనించలేకపోయారు. బుధవారం ఉదయం మృతదేహమై కనిపించాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
మార్కాపురం టౌన్: పట్టణంలోని కరెంటు ఆఫీసు వెనుక నివాసం ఉంటున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. పట్టణ ఎస్సై సైదుబాబు కథనం ప్రకారం.. దూదేకుల సిద్ధయ్య కుమార్తె సలీమా (20) పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటూ పూల అల్లకం చేస్తుండేది. కొన్నాళ్లుగా కిడ్నీలో రాళ్లతో పాటు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ కోతపై రైతుల కన్నెర్ర
తాళ్లూరు: వ్యవసాయ విద్యుత్ను సక్రమంగా ఇవ్వకుండా మరమ్మతుల పేరుతో విద్యుత్ను తరుచూ నిలిపేస్తున్న లైన్మన్ నిర్వాకంపై బుధవారం రాత్రి తాళ్లూరు దక్షణ ప్రాంత పొలాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం మూడు నాలుగు గంటల పాటు విద్యుత్ కోత విధించడంపై మండిపడ్డారు. విద్యుత్ సరఫరాపై సమాచారం అడిగినా లైన్మన్ సక్రమంగా సమాధానం చెప్పడం లేదన్నారు. ఇన్చార్జి విద్యుత్ ఏఈ సైతం సమాచారం సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదే విధంగా విద్యుత్ సరఫరా చేస్తే పంటలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధానం కొనసాగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
5 కేజీల గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: ఒడిశా నుంచి గంజాయి తెప్పించి స్థానికంగా విక్రయించే వ్యక్తులను ఒంగోలులో అరెస్టు చేసి వారి వద్ద 5 కేజీల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వన్టౌన్ సీఐ వై.నాగరాజు తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం గ్రామానికి చెందిన కుక్కల గోవర్దన్ రెడ్డి, ఒడిశాకు చెందిన రాజేష్ నాయక్, ఒంగోలు నగరంలోని బండ్లమిట్టకు చెందిన షేక్ ముజీర్లు ఒడిశాకు చెందిన మహేశ్వర్ మురుడి ద్వారా 5 కిలోల గంజాయి తెప్పించారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో తీసుకొచ్చిన గంజాయిని పంచుకునేందుకు సీతారాంపురం కొండమీదకు చేరుకున్నారు. కొండమీద రామాలయం గుడి వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు వెంటనే దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రేతలను పట్టుకొన్న సీఐ నాగరాజు, ఎస్సైలు సాంబశివరావు, సుబ్రమణ్యంలను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.

పశువుల కాపరిని బలి తీసుకున్న చెరువు