చంద్రబాబు అంటేనే మోసం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అంటేనే మోసం

Jun 19 2025 7:46 AM | Updated on Jun 19 2025 7:46 AM

చంద్రబాబు అంటేనే మోసం

చంద్రబాబు అంటేనే మోసం

దర్శి (కురిచేడు): వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదికే హామీలన్నీ అమలు చేసి అందరి మన్ననలు పొందారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఏడాదిలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం దర్శిలోని పార్టీ కార్యాలయంలో జగన్‌ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాంతి, సుస్థిరత, మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించి ప్రజలు ప్రశాంతంగా జీవించేలా పటిష్టమైన చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలందించి వారి మనస్సులో సుస్థిర స్థానం సాధించారన్నారు. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చి పేదవాడు సైతం కార్పొరేట్‌ విద్య అందుకునేలా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు నగదు పెంచి కరోనా వంటి భయంకర వ్యాధులను సైతం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించిన గొప్ప ముఖ్యమంత్రిగా దేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నలిచారని కొనియాడారు. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు వచ్చేలా చేసిన ఘనత ఆయనదేనన్నారు. అవసరమైన సమయంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా పంటలు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసిన రైతు పక్షపాతి అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ మాత్రమేనన్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో పంటనష్టం నుంచి రైతులను ఆదుకునేందుకు పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించి వారికి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో అశాంతి, అరాచకం, ఆటవిక పాలనే సాగిందని దుయ్యబట్టారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఏటా రైతులకు పంటసాగు సాయం కింద రూ.20 వేల ప్రకారం చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండో ఏడాది వచ్చినా రైతులకు మొండిచేయి చూపిన మోసగాడు చంద్రబాబు..అని ఎమ్మెల్యే బూచేపల్లి మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిపై నోరు మెదపటం లేదని, మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు తుస్సుమందని ఎద్దేవా చేశారు. అందరికీ తల్లికి వందనం అందిస్తామని చెప్పి అడ్డంకులు సృష్టించి భారీ కోతలు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు ఏడాది పాలనలో వ్యతిరేకత, జగనన్నపై తరగని అభిమానంతోనే ప్రజలు చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్వచ్ఛందంగా వెల్లువలా పోరుబాటలో పాల్గొంటున్నారని వివరించారు. చంద్రబాబు ఈ ఏడాదిలో ప్రజా సంస్కరణలను విస్మరించి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేయడంపైనే దృష్టి సారించారని మండిపడ్డారు. ఏడాది కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకండా రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. అప్పులు చంద్రబాబు, కూటమి నాయకులకు సంపదను సృష్టించేందుకు ఉపయోగపడ్డాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే బూచేపల్లి విమర్శించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, వైవీ సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement