
దోపిడీ కేసులో ఆధారాల సేకరణ
● ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలు పద్మజ
చీమకుర్తి: సాధువు వేషంలో వచ్చిన నిందితుడు ఓ మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ చేసిన కేసులో చీమకుర్తి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. నేరస్తుడిని రెండుమూడు రోజుల్లో పట్టుకుంటామని చీమకుర్తి సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి పక్కన నివాసం ఉంటున్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు గోలి పద్మజపై ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి సాధువు వేషంలో వచ్చి కత్తి, రుబ్బురోలు పత్రంతో దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసుతో పరారైన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. పరిసరాలలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితుడిని ఈపాటికే పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. పూర్తి ఆధారాలు సేకరించి రెండుమూడు రోజుల్లో నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పద్మజ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటుందని బంధువులు తెలిపారు.

దోపిడీ కేసులో ఆధారాల సేకరణ