పచ్చదొంగలు.! | - | Sakshi
Sakshi News home page

పచ్చదొంగలు.!

Jun 16 2025 7:21 AM | Updated on Jun 16 2025 7:21 AM

పచ్చదొంగలు.!

పచ్చదొంగలు.!

బిట్రగుంట చెరువులో

ఒంగోలు, సాక్షి నెట్‌వర్క్‌: జాతీయ రహదారికి కూతవేటు దూరంలో జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట, సింగరాయకొండ మండలం కలికవాయ గ్రామాల పరిధిలో ఉన్న బిట్రగుంట చెరువులో మరోసారి పచ్చ పార్టీ దొంగలు బరితెగించారు. తెలుగు తమ్ముళ్ల అండదండలతో ఆరు రోజులుగా అక్రమార్కులు యథేచ్ఛగా తుమ్మచెట్లు నరికి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెండు గ్రామాల పంచాయతీ అధికారులు, ఇరిగేషన్‌, పోలీసు, అటవీశాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.

చెరువులో రూ.60 లక్షల విలువైన

తుమ్మచెట్లు...

కలికవాయ, బిట్రగుంట గ్రామాల పరిధిలో ఉన్న అతి పెద్ద కె.బిట్రగుంట చెరువులో దాదాపు 10 సంవత్సరాలుగా తుమ్మచెట్లు కొట్టకపోవటంతో సుమారు 60 లక్షల రూపాయల విలువైన కలప ఉంది. ఈ చెట్లకు గ్రామ పంచాయతీ, ఫారెస్టు, ఇరిగేషన్‌ అధికారుల ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించాలి. పాట దక్కించుకున్న మాత్రమే చెట్లు కొట్టుకోవాలి. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగకుండా కూటమి నాయకుల అండదండలతో నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వ్యక్తి తుమ్మచెట్లను నరికివేసి కలప తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ఆరురోజులుగా ప్రతిరోజూ సుమారు 2 లక్షల రూపాయల విలువగల కర్ర కొట్టుకుని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని చెబుతున్నారు.

భారీగా చీకటి ఒప్పందాలు...

బిట్రగుంట చెరువులో చెట్లు కొట్టుకునేందుకు కందుకూరుకు చెందిన వ్యక్తితో సుమారు 17 లక్షల రూపాయలకు తెలుగు తమ్ముళ్లు చీకటి ఒప్పందం కుదుర్చుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అండగా నిలుస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులో చెట్ల నరికివేతపై రెండు గ్రామాల ప్రజలు ఇరిగేషన్‌, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, చెట్ల నరికివేత విషయం తమకు తెలియదని, వెంటనే పరిశీలించి వాస్తవమైతే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ.. అక్రమార్కులతో కుమ్మక్కయ్యారనే అనుమానాలున్నట్లు రైతులు తెలిపారు. ఇటీవల చెరువులను కాపాడేందుకు నియమించిన సాగునీటి సంఘాల అధ్యక్షులు కూడా అక్రమంగా చెట్లు నరికివేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవటంపై రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖల అధికారులు స్పందించి అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని లక్షలాది రూపాయల విలువ గల తుమ్మచెట్లను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

మళ్లీ అక్రమంగా తుమ్మచెట్ల నరికివేత

ప్రతిరోజూ సుమారు రూ.2 లక్షల విలువైన తుమ్మకర్ర రవాణా

కె.బిట్రగుంట, కలికవాయ పంచాయతీల

పరిధిలోని చెరువులో యథేచ్ఛగా అక్రమాలు

టీడీపీ నేతలే చేస్తున్నారని ఆరోపిస్తున్న

రెండు గ్రామాల ప్రజలు

చోద్యం చూస్తున్న పంచాయతీ, ఇరిగేషన్‌ అధికారులు

గత సంవత్సరం చెట్ల నరికివేతను అడ్డుకున్న రైతులు...

గత సంవత్సరం ఆగస్టులో తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా సుమారు 10 లక్షల రూపాయల విలువ గల తుమ్మచెట్లను నరికివేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఇరిగేషన్‌, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్‌ అధికారులు చెరువును పరిశీలించి అక్రమంగా చెట్ల నరికివేత జరిగినట్లు నిర్ధారించుకుని సింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చెరువులో అక్రమంగా తుమ్మచెట్లు నరికే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి అక్రమంగా చెట్ల నరికివేత నిలిచిపోయింది. కానీ, ఇప్పుడు మళ్లీ అక్రమంగా చెట్లు నరకటంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement