
గ్రామకంఠం స్వాహా..
మర్రిపూడి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికార పార్టీ అండదండలతో ఆ పార్టీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. గ్రామకంఠం భూమిని ఆక్రమించడంతో పాటు అక్కడ ఏళ్ల తరబడి అనుభవదారుగా ఉన్న వారిపై అధికారుల అండతో అక్రమ కేసులు బనాయించారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని వెంకటకృష్ణాపురం గ్రామంలో సర్వే నంబరు 15లో 9.92 ఎకరాల విస్తీర్ణంలో గ్రామకంఠం భూమి ఉంది. అందులో 51 సెంట్ల భూమిలో గ్రామానికి చెందిన బొట్లగుంట సత్యన్నారాయణ, బొట్లగుంట వెంకట కృష్ణయ్య కుమారులు శ్రీను తిరుపాలు కొన్ని తరాలుగా గేదెలు, ఆవులు, గడ్డివాములు వేసుకుని పశువులను మేపుకుంటూ నివాసం ఉంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ సానుభూతిపరులకు ఆ గ్రామకంఠం పై కన్నుపడింది. కందుకూరు మండలం కోవూరు గ్రామానికి చెందిన కొండూరి వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీను వెంకటకృష్ణాపురం గ్రామంలో సదరు సర్వే నంబరు 15లో 6 సెంట్లు భూమి ని అదే గ్రామానికి చెందిన పాలెపు పద్మ, గణిపినేని కొండయ్యల వద్ద కొనుగోలు చేశాడు. టీడీపీ నేతల అండదండలతో దానికి ఆనుకుని ఉన్న మరో 10 సెంట్లు భూమిని యథేచ్ఛగా ఆక్రమించి రేకుల షెడ్ వేశాడు. ఇంతటితో ఆగకుండా కొండూరి వెంకటేశ్వర్లు తన కుమారుడి పేరుతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి సింగరాయకొండ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఏడాది 280 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. దీనిపై ఇద్దరూ ఘర్షణపడ్డారు. మా అనుభవంలో ఉన్న భూమిలో ఇళ్లు కట్టుకునేందుకు జేసీబీతో గుంతలు తీస్తుంటే కొంటూరి వెంకటేశ్వర్లు, శ్రీనులు పోలీసుల సహాయంతో నిలిపివేశాడని, దీనిపై కోర్టుకు వెళ్లామని, కోర్టులో కేసు నడుస్తున్నా, ఎలాంటి అనుమతులు లేకుండా టీడీపీ నాయకుల అండదండలతో మా స్థలంలో అక్రమంగా గుంతలు తీస్తూ మా పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బొట్లగుంట తిరుపాలు, బొట్లగుంట శ్రీనులు వాపోయారు. గ్రామ కంఠం భూమి ప్రభుత్వానిది కాదని, సదరు స్థిరాస్థి ఎండోమెంట్ వారి పరిధిలో లేదని గత ఏడాది అప్పటి తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించినట్లు పత్రాలు సృష్టించడం కొసమెరుపు. వారు కొనుగోలు చేసిన 6 సెంట్ల భూమిలో కాకుండా హద్దులు దాటి మా స్థలాన్ని ఆక్రమిస్తున్నారన్నారని తెలిపారు. దౌర్జన్యంగా మా స్థలంలో గుంతలు తీసి సిమెంట్ పనులు చేపట్టారని, అక్రమ కట్టడాలు కట్టడమే కాక మహిళలను సైతం శనివారం ఇష్టానుసారంగా తిడుతూ, కొట్టబోయారని, ఈ సంఘటన పై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు మా వినతులను పక్కన పడేశారని బాధితులు వాపోతున్నారు. ఈ భూ ఆక్రమణకు స్థానిక టీడీపీ నాయకులతో పాటు, అధికారుల అండదండలు ఉన్నట్లు సమాచారం. విచారించి తగు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
కబ్జాకోరల్లో గ్రామ కంఠం భూమి ఏళ్లుగా అనుభవదారులుగా ఉన్న వారికి అన్యాయం దౌర్జన్యం చేసి యథేచ్ఛగా శాశ్వత కట్టడాలు ఆక్రమణదారులకు అండగా అధికారులు

గ్రామకంఠం స్వాహా..