
వైభవంగా నారసింహునికి అభిషేకం
సింగరాయకొండ: పురాణప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ముఖ్య ఘట్టమైన నారసింహునికి అభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నారసింహుడు, భూదేవి, శ్రీదేవి ఉత్సవమూర్తులకు అభిషేకం, చివరగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణ–పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం ఆలయంలో లక్ష్మీ సంవాద ఉత్సవం నిర్వహించారు. సోమవారం రాత్రి పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయని ఈఓ పీ కృష్ణవేణి వివరించారు.
చక్రస్నాన కార్యక్రమంపై భక్తుల అసంతృప్తి:
స్వామి వారికి చక్రస్నానం కార్యక్రమం కొండ కింద ఉన్న భవనాశిలో కాకుండా స్టీలు డ్రమ్ములో నిర్వహించటంపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో అయినా భవనాశి పరిరక్షణకు ఆలయ అధికారులు కృషి చేయకపోవటం బాధాకరమన్నారు. భవనాశిలో చక్రస్నానం చేసి ఉంటే స్వామితో పాటు తాము కూడా మునిగే వారమని చివరకు డ్రమ్ములో స్వామికి చక్రస్నానం చేయించిన తరువాత ఆ నీటిని చల్లించుకుని తృప్తి పడాల్సి వచ్చిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసిద్ధి చెందిన ఆలయంలో కూడా అధికారులు ఈ విధంగా చేయటమేంటని భక్తులు అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీ నరశింహాచార్యులు, ఉదయగిరి లక్ష్మీ నరశింహాచార్యులు, ఉదయగిరి వెంకట సుదర్శనాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా నారసింహునికి అభిషేకం