వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

Apr 24 2025 8:27 AM | Updated on Apr 24 2025 8:27 AM

వక్ఫ్

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

సింగరాయకొండ: ముస్లింలను అణగదొక్కడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చారని ముస్లిం నాయకులు, వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం హిందూ, ముస్లిం, మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ముస్లిం నాయకులు మాట్లాడుతూ వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ద్వారా ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తరువాత క్రైస్తవ, హిందూ ఆలయ భూములను సైతం స్వాధీనం చేసుకుంటారన్నారు. మోడీ ప్రవేశపెట్టిన వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఆంధ్ర, బీహార్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు. శాంతియుత ర్యాలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పెద్ద మశీదు నుంచి ప్రారంభమై మినీ బైపాస్‌ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌, పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌ మీదుగా కందుకూరు రోడ్డు సెంటర్‌ వరకు చేరి మానవహారంగా ఏర్పడ్డారు. అంతకు ముందు పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జ్యోతిరావ్‌ పూలే, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో హిందూ, ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వైఎస్సార్‌ సీపీ, సీపీఐ, సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

దర్శి (కురిచేడు): వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దర్శిలో ముస్లింలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. గంగవరం రోడ్డులోని మర్కస్‌ మసీద్‌ నుంచి గడియార స్తంభం వరకు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ చేశారు. అనంతరం డీటీ దేవప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో ముస్లిం పెద్దలు మాట్లాడుతూ దేశంలో ముస్లింల హక్కులు హరిస్తున్నారని, ముస్లింల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసుకున్న వక్ఫ్‌ భూములు, ఆస్తులను చట్టం రూపంలో ప్రభుత్వం దోచుకునేందుకు తెరతీసిందన్నారు. వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతర సభ్యుల నియామకం తమ హక్కులకు భంగం కలిగించేలా ఉందన్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింల విషయంలో మాత్రం మరోలా ఎందుకు వ్యవహరిస్తోందని, రాజ్యాంగంలో ఇచ్చిన మత స్వేచ్ఛను, మత కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం సరికాదన్నారు. వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మత పెద్దలు, మసీదుల ప్రతినిధులు, నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ముస్లింలు పాల్గొన్నారు.

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి 1
1/1

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement