
జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ
ఒంగోలు: జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, ప్రకాశం పంతులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నలుగురికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడంతోపాటు 12 మంది ఆఫీస్ సబార్డినేట్లకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో బి.జాలిరెడ్డి, డిప్యూటీ సీఈవో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
పీడీసీసీ బ్యాంకులో..
ఒంగోలు సబర్బన్: స్వాతంత్య్ర దినోత్సవం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పీడీసీసీ బ్యాంకు ఆవరణలో నూతనంగా నియమితులైన చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి(బన్నీ) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంకులో దౌట్ సోర్సింగ్లో డ్రైవర్ ఉద్యోగం చేస్తూ ఇటీవల మృతి చెందిన సాదు జనార్దన్ కుమార్తెలు సాదు ఆరాధ్య, సాదు భవానిలకు బ్యాంకు సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది రూ.1,08,500 సేకరించి బ్యాంకు డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్ల బాండ్లను వారికి చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి అందజేశారు.
హైదరీ క్లబ్లో..
హైదరీ క్లబ్లో స్వాతంత్య్ర దినోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రాంగణంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం.ప్రసాద్రెడ్డితో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కె.వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు సి.మాలకొండయ్య, జాయింట్ సెక్రటరీ టీవీ సుబ్రహ్మణ్యేశ్వర్, పీడీసీసీ బ్యాంకు సీఈఓ వై.ప్రకాశ్తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
