తాడేపల్లి : రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపు చర్యలు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోందని ధ్వజమెత్తారు. దీనిపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శైలజానాథ్.
ఈరోజు(సోమవారం, జూన్ 15వ తేదీ) రాయలసీమ లిఫ్టు నిలిపివేతపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ నేతలు సమావేశమయ్యారు. దీనికి సాకే శైలజానాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, కాకాని గోవర్ధన రెడ్డి తదితరులు హాజరయ్యారు. త్వరలో నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపునకు దిగారు. దీనిపై రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తాం. తొలుత అనంతపురం, నెల్లూరు జిల్లాలో తొలుత పర్యటిస్తాం. ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఒత్తిడి చేస్తాం. మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. కృష్ణా, తుంగభద్ర మీద ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా రాయలసీమ ఎడారిగా మారుతోంది. చంద్రబాబు తక్షణం స్పందించాలి.
వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్టును ఏర్పాటు చేస్తే చంద్రబాబు దాన్ని ఆపేశారు. రేవంత్ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను పనంగా పెట్టారు. ఏపీ హక్కులను కాలరాశారు. అదేమంటే బనకచర్ల ప్రాజెక్టు పేరు చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే రాయలసీమ లిఫ్టును పూర్తి చేయకుండా బనకచర్ల అంటారెందుకు?, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుక పడిన ప్రాంతాల కన్నీటితో రాజధానిని కడతారా?, రాజధానిలో జరుగుతున్న అవినీతికి అడ్డూ అదుపు లేదు. కేంద్ర ప్రభుత్వ భవనాలకంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయటం వెనుక భారీ అవినీతి ఉంది. అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం పెట్టినా మావిగన్, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనేదే లేదు’ అని ధ్వజమెత్తారు.


