తాడేపల్లి : విద్యుత్ చార్జీలపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ భాబు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానన్న చంద్రబాబు.. ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇది కాకుండా 23 నెలల్లోనే రూ. 20 వేల కోట్ల భారాన్ని జనం మీద మోపారని టీజేఆర్ విమర్శించారు.
ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. చంద్రబాబు ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా.. సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారన్నారు.
‘విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ 2003లో మహిళలు ధర్నాకు దిగితే గుర్రాలతో తొక్కించిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి మళ్లీ మాయమాటలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. విద్యుత్ కొనుగోళ్లలోనూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. సెకీ నుంచి వైఎస్ జగన్ 2.49 రూపాయలకు కొంటే.. చంద్రబాబు 4.49 రూపాయలకు కొన్నారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ బయట పెడుతున్నారనే వైఎస్ జగన్ పేరును నిద్రలో కూడా కలవరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, మంత్రులు నిద్రలో కూడా జగన్ జపమే చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.


