సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు.
దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు..
చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది
బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు.
గోల్డ్మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.

అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.
డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు.


